ఏప్రిల్‌లో భారత్‌లో ఎమర్జెన్సీ.. క్లారిటీ ఇచ్చిన సైన్యం

By సుభాష్  Published on  31 March 2020 2:11 AM GMT
ఏప్రిల్‌లో భారత్‌లో ఎమర్జెన్సీ.. క్లారిటీ ఇచ్చిన సైన్యం

దేశంలో త్వరలో ఎమర్జెన్సీ విధిస్తారని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై భారత సైన్యం స్పందించింది.ఇలాంటి వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను దేశంలో కట్టడి చేసేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించింది. వచ్చే నెలలో ఎమర్జెన్సీ విధించనున్నారని సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలేనని భారత ఆర్మీ ధృవీకరించింది. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు మాజీ సైనికులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ సేవలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని స్పష్టం చేసింది.

సామాజిక మధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ ఎవ్వరూ నమ్మవద్దని ఏడీజీపీఐ తెలిపింది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ ఈ లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. కాగా, ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 1100లకు చేరింది. ఈ మహమ్మారి బారిన ఇప్పటి వరకూ 30 దాటేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 33వేల వరకూ మృతి చెందారు.



ఇక ప్రపంచ వ్యాప్తంగా అధిక మరణాలు ఇటలీలో చోటు చేసుకున్నాయి. ఇక అమెరికాలో కూడా కరోనా దడదడలాడిస్తోంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌ను వణికిస్తోంది. ఇక్కడ కూడా కరోనా పాజిటివ్‌ల సంఖ్య లక్షా 50 వేల వరకు చేరుకోగా, 2500 వరకు మృతి చెందారు. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ దేశంలో కరోనా వైరస్‌ పట్టి పీడిస్తోంది. దీంతో ఏప్రిల్‌ 30వ తేదీ వరకు ట్రంప్‌ లాక్‌డౌన్‌ ప్రకటించారు. గంట గంటకు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ట్రంప్‌కు మరింత ఆందోళన కలిగిస్తోంది.

Next Story