2,500 ఏళ్లయినా చెక్కు చెదరలేదు

By సుభాష్  Published on  6 Oct 2020 9:30 AM GMT
2,500 ఏళ్లయినా చెక్కు చెదరలేదు

ఈజిప్టు చరిత్ర గుర్తుకు వస్తే మమ్మీలే గుర్తుకు వస్తాయి. ఏళ్లనాటి మమ్మీలను వెలికి తీసి వాటి చరిత్రను తవ్వి తీయడంలో అక్కడి శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఆరంభంలో సక్కారా ప్రాంతంలో 59 మమ్మీలను వెలికి తీశారు. సక్కారా అనేది ఈజిప్టులో పురాతన శ్మశానవాటిక. ఇక్కడ వెలికి తీసిన మమ్మీలు దాదాపు 2,500 ఏళ్ల క్రితానికి చెందినవిగా గుర్తించారు శాస్త్రవేత్తలు. శనివారం అందుకు సంబంధించిన ఓ శవపేటికను ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్తలు తెరిచారు. బయటకు తీసిన శవపేటికలు, అందులో మమ్మీలు కూడా చెక్కుచెదరకుండా ఉండడాన్ని గుర్తించారు. ఇవి ఈజిప్టు సమాజంలోని పూజారులు, ఇతర ప్రముఖ వ్యక్తులుగా గుర్తించారు.

అయితే దీనికి సంబంధించిన ఓ వీడియోను ఈజిప్టు పర్యాటక, పురావస్తు మంత్రిత్వశాఖ తన ఖాతాలో పోస్టు చేయగా, ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఈజిప్టులోని న్యూజిలాండ్‌ రాయబారి గ్రెగ్‌ లూయిస్‌ కూడా ట్విటర్‌లో అన్‌సీలింగ్‌ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో శవపేటికలో మమ్మీ వస్త్రంతో చుట్టబడి ఇంత కూడా పాడవకుండా ఉంది. ఈజిప్టు పురావస్తు శాఖ షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు 9 మిలియన్ల మందికిపైగా వీక్షించారు.దీనిపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 2020లో ఒక మిలీనియా పాత శవపేటికను తెరవడం ఉత్తమమైన చర్య కాకపోవచ్చు అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

కాగా, ఈజిప్టు పర్యాటక, పురాతన మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. మొదట 13 శవపేటికలతో మూడు బావులు సక్కారాలో గుర్తించగా, ఆ తర్వాత మరో 14 శవపేటికలు బయటపడ్డాయి. అలా ఈ రోజు వరకు మొత్తం 59 శవపేటికలను వెలికి తీశారు. వీటిని గిజాలోని కొత్త గ్రాండ్‌ ఈజిప్టియన్‌ మ్యూజియానికి తరలించి ప్రదర్శన కోసం ఉంచనున్నారు.

Next Story