ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు షాక్
By రాణి Published on 22 Jan 2020 10:17 AM GMTముఖ్యాంశాలు
- AIR సర్వేలో గణనీయంగా తగ్గిపోయిన పాఠకుల సంఖ్య
- సాక్షి కొంచెం బెటర్
తాజాగా వచ్చిన ప్రింట్ మీడియా గణాంకాలు చూశాక..బహుశా ఈనాడు రామోజీరావుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కళ్లు తిరిగిపోయి ఉంటాయోమో! ఎందుకంటే ఈ గణాంకాల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పాఠకులతో పాటు ఇటు తెలంగాణలో నమస్తే తెలంగాణ పత్రికల పాఠకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇదే సమయంలో సాక్షికి కాస్త కంటి తుడుపుగా ఇదివరకటితో పోలిస్తే..పాఠకుల సంఖ్య పెరిగింది. ఇది చూశాక పత్రికలకు గడ్డుకాలం వచ్చిందన్న మాట నిజమేనని ఒప్పుకోక తప్పదు. టీవీలకు బార్క్ రేటింగ్స్, సైట్లకు అలెక్సా ర్యాంకింగ్స్ ఎలా చూస్తామో..పత్రికలకు కూడా ఏబీసీ, ఐఆర్ఎస్ అంత ప్రామాణికం మరి. వీటిలో TR (Total Readership), AIR (Average Issue Readership) అని రెండు విభాగాలు ఉంటాయి..వీటిలో ముఖ్యంగా AIr నే పరిగణనలోకి తీసుకుంటారు.
వివరాల్లోకి వెళ్తే...AIR ఇచ్చిన సమాచారం ప్రకారం 2019 రెండో క్వార్టర్ తో పోలిస్తే 2019 మూడో క్వార్టర్ ఫలితాల్లో ఈనాడు 11 శాతం పాఠకులను కోల్పోయింది. 2019 రెండో క్వార్టలో 5973గా ఉన్న సంఖ్య మూడో క్వార్టర్లో 5313కి పడిపోయింది. అంటే సుమారుగా 600 డ్రాప్. దేశంలోని టాప్ టెన్ పత్రికల్లో ఒక్కటైన ఈ ప్రధాన పత్రికకు కమిటెడ్ రీడర్స్ సంఖ్య ఏకంగా 11 శాతం తగ్గిపోవడం అంటే మామూలు విషయమేమి కాదండోయ్. . 2017లో 7016గా ఉన్న ఈనాడు సంఖ్య ఇప్పుడు 5313కి పడిపోయింది. ఆంధ్రా, తెలంగాణ, హైదరాబాద్ లలో ఈ పతనం సరిసమానంగా ఉండటం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం..ఈ పత్రిక కేవలం ఒక పార్టీకి సంబంధించిన రాజకీయ వార్తలను మాత్రమే ప్రచురించడం.
ఇక ఆంధ్రజ్యోతి విషయానికొస్తే..సంచలనమే ధ్యేయంగా..'పచ్చ'దనమే ఊపిరిగా బ్రతికే పత్రిక ఇది. 2019 రెండో క్వార్టర్ తో పోలిస్తే మూడో క్వార్టర్ లో జ్యోతి AIR రేటింగ్ 2250 నుంచి 2017 కి పడిపోయింది. అంటే సుమారు 10 శాతం కిందికి వెళ్లిపోయింది. 2017 ఏడాదితో పోలిస్తే 2019లో AIR 20 శాతం పడిపోయింది. అంటే ఈ రెండు పత్రికలను చదివే పాఠకుల సంఖ్య సుమారుగా 5 - 7 లక్షల వరకూ తగ్గిపోయింది.
ఇందులో జ్యోతికి కాస్త ఉపశమనాన్ని, మరింత చేదునిచ్చే విషయాలేమిటంటే..హైదరాబాద్ లో కొంచెం బెటర్ గా ఉన్న పాఠకుల సంఖ్య...ఏపీలో మరింత తగ్గిపోయింది.
తెలంగాణలో పెత్తనం ఆంద్రా మీడియాదే..
నమస్తే తెలంగాణ సంగతేంటి అంటారా...కేసీఆర్ అన్నింటికీ అతీతుడే కాబట్టి ఇలాంటి విషయాల్లో కిమ్మనకుండా ఉంటాడు. తెలంగాణ మెయిన్ స్ర్టీమ్ పత్రికగా చెప్పుకునే నమస్తే తెలంగాణ పాఠకుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. 2019 2, 3 క్వార్టర్ల మధ్యలోనే ఇది 20 శాతం పాఠకులను కోల్పోయింది. తెలంగాణ డెడికేటెడ్ ప్రధాన పత్రిక ఇదే అయినప్పటికీ..ఇప్పటికి కూడా ఇక్కడ ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిలదే పైచేయి.
ఈ మూడు పత్రికల మీద సాక్షి కొంచెం బెటర్ రిజల్ట్ సాధించిందనే చెప్పాలి. సాక్షి పేపర్ వచ్చిన కాలమది. సత్యమేవ జయతే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ పేపర్ అప్పట్లో ఈనాడుకు పోటీగా దిగింది. కానీ చెత్త చెత్త విధానాలతో పూర్తిగా చతికిలపడిపోయింది. ఆ తర్వాత... చంటిపిల్లాడు తప్పటడుగులు వేస్తూ సరైన నడక నేర్చుకున్న చందంగా.. 2019 AIR క్వార్టర్ 3 గణాంకాల్లో ఒకట్రెండు శాతం పాఠకుల సంఖ్యను పెంచుకుంది. మిగతా వాటితో పోలిస్తే..సాక్షికి ఇదొక కంటితుడుపు చర్యవంటిదే. సాక్షి మిగతా ఎడిషన్స్ పక్కనపెట్టి కేవలం ప్రధాన పత్రిక కోణంలో చూస్తే...ఈ రిజల్ట్ వచ్చిందనిAIR గణాంకాలు చెప్తున్నాయి. ఇది కాస్త చెప్పుకోదగ్గ విషయమే కదా. (ఇక్కడ సాక్షి పత్రికను పొగడటం లేదండోయ్. AIR ఇచ్చిన గణాంకాల ప్రకారమే ఇవన్నీ చెప్తున్నాం.)
AIR ఇచ్చిన తాజా గణాంకాలను బట్టి చూస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లతో పాటు మహాన్యూస్, NTV, AP 24/7 ఛానెళ్లు ఎన్ని జాకీలు పెట్టి 'పచ్చ'దనాన్ని పైకి లేపాలని చూసినా ప్రజలు దానిని ఒప్పుకోరని తేలిందన్నమాట.