బర్త్‌డే వేడుకల్లో విషాదం.. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతు

By సుభాష్  Published on  1 Aug 2020 7:38 AM GMT
బర్త్‌డే వేడుకల్లో విషాదం.. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతు

స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. మిత్రుడి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. జిల్లాలోని తుని మండలం హంసవరానికి చెందిన మఠం హరీష్‌ (17), కిల్లాడ మణికంఠ (14), పృద్వీ (16) అనే ముగ్గురు విద్యార్థులు స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల కోసం గ్రామ సమీపంలోని తోటకి వెళ్లారు.

అందరు కలిసి సరదాగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఈత కొడదామని పక్కనే ఉన్న పోలవరం కాల్వలోకి దిగారు. నీటి ఉధృతి ఎక్కువ కావడంతో ముగ్గురు నీటిలో కొట్టుకుపోయారు. విద్యార్థులు నీటిలో గల్లంతైన విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు, గజ ఈతగాళ్లు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులు నీటిలో కొట్టుకుపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. గల్లంతైన వారిలో హరీష్‌ పదో తరగతి పూర్తి చేయగా, మణికంఠ ఎనిమిదో తరగతి చదువుతుండగా, పృద్వీ పదో తరగతి చదువుతున్నాడు.

Next Story