'పట్నఘఢ్' విడుదలపై స్టే ఇవ్వలేం: సుప్రీం కోర్ట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 12:12 PM GMT
పట్నఘఢ్ విడుదలపై స్టే ఇవ్వలేం: సుప్రీం కోర్ట్

అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పలువురు సినీ దిగ్గజాల ప్రశంసలు అందుకున్న దర్శకుడు రాజేష్ టచ్ రివర్ కు సుప్రీం కోర్ట్ లో విజయం దక్కింది. ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న 'నా బంగారు తల్లి' చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. కాగా.. పగ, ప్రతీకారం నేపథ్యంలో నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం 'పట్నఘఢ్'.

కానీ.ఈ చిత్రంపై వ్యతిరేకంగా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ మేరకు ఈ చిత్రం విడుదలపై స్టే విధించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అనంతరం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా..సినిమాపై పిటిషనర్ కు అభ్యంతరాలు ఏమైనా ఉంటే 30 రోజుల్లోపు సెన్సార్ బోర్డును సంప్రదించాలని సూచించింది. "భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం 'పట్నఘఢ్' చిత్రానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సమర్ధించలేం అని స్పష్టం చేసింది. ఈ మేరకు పిటషన్‌ను కొట్టి వేస్తున్నాం" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‌

కథేటంటే...?

ఒరిస్సాలోని పట్నఘఢ్ పట్టణంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రాజేష్ టచ్ రివర్ రూపొందించిన చిత్రం 'పట్నఘఢ్'. పగ, ప్రతీకారం నేపథ్యంలో ఓ నేరస్తుడి మనస్తత్వాన్ని ఆవిష్కరిస్తూ... థియేటర్లలో ప్రేక్షకులు కుర్చీ అంచున కూర్చుని చూసేలా... ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రూ. 5 కోట్ల నిర్మాణ వ్యయంతో తెలుగు, ఒరియా భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందించారు. ఒరియా చలన చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రమిది. ఇప్పటివరకు ఐదు కోట్లతో ఒరియాలో ఎవరు సినిమా తీయలేదు.

"పెళ్లి అయిన ఐదో రోజు నవ దంపతులకు ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది.‌ అందులో ఏముందో అని తెరిచి చూడగా బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. పెళ్లి కొడుకు తో పాటు అతడి గ్రాండ్ మదర్ ఆ బ్లాస్ట్ లో మరణిస్తుంది. ఈ ఘటనతో పట్నఘఢ్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఈ ఘటనకు కారణమైన హంతకుల్ని పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందనేది సినిమా కథ" అని రాజేష్ టచ్ రివర్ తెలిపారు.

నటీనటులు..

ప్రముఖ బాలీవుడ్ నటుడు, తెలుగులో 'పంజా', 'ఘాజి' తదితర చిత్రాల్లో నటించిన అతుల్ కులకర్ణి ఈ చిత్రంతో ఒరియా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.‌ ఇంకా ఈ చిత్రంలో యష్ పాల్ శర్మ, ఒరియా నటుడు మనోజ్ మిశ్రా, తనికెళ్ల భరణి, ఒరియా నటి చిన్మయి మిశ్రా, అను చౌదరి, మలయాళ నటుడు సంజు శివరాం, పుష్ప పాండే ప్రధాన పాత్రల్లో నటించారు.

Next Story