కరోనాను క్యాష్‌ చేసుకునే పనిలో మెడికల్‌ షాప్‌ యజమానులు..

By Newsmeter.Network  Published on  5 March 2020 8:49 AM GMT
కరోనాను క్యాష్‌ చేసుకునే పనిలో మెడికల్‌ షాప్‌ యజమానులు..

కరోనా వైరస్‌.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా పేరు చెబితే చాలు నగరజీవి వణికిపోతున్నాడు. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు మెడికల్‌ షాపుల యజమానులు. ముఖానికి ధరించే మాస్కుల ధరలను విఫరీతంగా పెంచేశారు. మేం చెప్పిందే రేటు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇష్టం ఉంటే తీసుకో.. లేకుంటే లేదు అంటూ కస్టమర్లతో కొందరు మెడికల్‌ షాప్‌ యజమానులు అంటున్నారు.

రెండు రోజుల ముందు వరకు రూ.1.50 నుంచి రెండు రూపాయలు ఉండే మాస్క్‌ ధర ఇప్పుడు రూ.50కి చేరింది. 100 మాస్కులు ఉన్న ప్యాక్‌ ధర రూ.140 ఉంటే.. ఇప్పుడు రూ.1000కి విక్రయిస్తున్నారు. క్వాలిటీ అధికంగా ఉండే ఎన్ 95 మాస్క్ ధర రూ. 40. ఇప్పుడు ఏకంగా రూ. 600కు విక్రయిస్తున్నారు. కొన్ని మెడికల్‌ షాపుల వద్ద నో స్టాక్‌ బోర్టులు కనిపిస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో వారు చెప్పిందే రేటు. కరోనా వైరస్‌ నుంచి తప్పించుకోవాలని నగరజీవి భావిస్తుంటే.. కరోనా వైరస్‌తో పండగ చేసుకుంటున్నారు మెడికల్‌ షాప్‌ యజమానులు. ఇదిలా ఉంటే.. మాంసం విక్రయదారుల అవస్థలు వేరుగా ఉన్నాయి. కరోనాకు ముందు కిలో చికెన్ ధర రూ. 200కు పైగా ఉండగా.. ఇప్పుడు ధర రూ. 120కి పడిపోయింది. అయినా కొనేవారు కనిపించడం లేదని మాంసం విక్రయదారులు వాపోతున్నారు.

ఇక.. తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను శుభ్రపరుస్తున్నామని వెల్లడించింది. జనాలు అధికంగా ఉండే మాల్స్, సినిమా హాల్స్ లను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత వాటి యాజమాన్యానిదేనని స్పష్టం చేసింది. ప్రైవేటు ఆసుపత్రులకూ కరోనాకు వైద్యం చేసే వెసులుబాటు కల్పిస్తున్నామని, ఆసుపత్రులు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేసుకోవచ్చని పేర్కొంది.

Next Story