నన్ను పట్టించుకోండి ప్రధాని గారు.. కేవలం హిందువుననే..
By న్యూస్మీటర్ తెలుగు
హిందు మతానికి చెందిన తనపై... పాకిస్తాన్ క్రికెట్ టీమ్లో కొందరు నాపై వివక్ష చూపిన మాట వాస్తవమేనని పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నాడు. ఈ విషయమై మాట్లాడేందుకు నాకు ధైర్యం లేదని.. కానీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం భయం లేకుండా బయటపెట్టారని అన్నాడు. నిజం మాట్లాడినందుకు అక్తర్కు థ్యాంక్స్ అని అన్నాడు కనేరియా.
ఓ టీవీ షోలో మాట్లాడిన షోయబ్ అక్తర్.. పాక్ టీమ్లో మంచి బౌలర్ అయిన కనేరియాపై హిందువన్న కారణంగానే కెప్టెన్ సహా కొందరు ఆటగాళ్లు వివక్ష చూపి వేధించారని అన్నాడు. కలిసి భోజనం కూడా చేయనిచ్చేవారుకాదని తెలిపాడు.
అక్తర్ వ్యాఖ్యలపై స్పందించిన కనేరియా.. తాను ధైర్యంగా ఈ విషయాలను బయటపెట్టలేకపోయానని.. షోయబ్ నిర్భయంగా నిజాలు చెప్పాడని.. తన పట్ల వివక్ష చూపిన వారి పేర్లను త్వరలోనే బయటపెడతానని అన్నాడు.
ఇదిలావుంటే.. తన మతంతో సంబంధం లేకుండా కొంత మంది ఆటగాళ్లు, బోర్డు అధికారులు నాకు అండగా నిలిచారని, వారి అందరికి ధన్యవాదాలు అని అన్నాడు.
అలాగే.. ప్రస్తుతం తన జీవితం ఏమాత్రం బాలేదని, తనను ఆదుకోవాలని కనేరియా పాక్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ను కోరాడు. తాను ఓ క్రికెట్ ఆటగాడిగా పాకిస్తాన్ జట్టుకు, దేశానికి చేయగలిగిందంతా చేశానని.. తాను కష్టాల్లో ఉన్న సమయంలో మీరు అండగా నిలవాలని కోరుతున్నానని కనేరియా అన్నాడు.
ఇంగ్లాండ్కు చెందిన ఎస్సెక్స్ తరుపున క్లబ్ క్రికెట్ ఆడుతున్న సమయంలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై తనపై జీవిత కాల నిషేధం విధించడంపై స్పందించాలని ప్రధానిని వేడుకున్నాడు. తాను తప్పు చేయలేదని, ఈ విషయంలో తాను ఇప్పటికే పాక్ క్రికెట్ బోర్డు సహా ప్రపంచంలో పలువురు ప్రముఖులు, క్రికెటర్లను కూడా కలిశానని.. కానీ ఇంతవరకు ఎవరూ సాయం చేయలేదని కనేరియా అన్నాడు.
ఇటువంటి సమస్యలో ఇరుకున్న చాలామంది పాక్ ఆటగాళ్లు చాలా ఈజీగా బయటపడ్డారని, కానీ తనను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. ప్రస్తుతం తాను అత్యంత దీన స్ఝితిలో ఉన్నానని.. ఇప్పటికైనా నన్ను పట్టించుకోవాలని పాక్ ప్రధానిని, ఆటగాళ్లను, బోర్డు అధికారులను, ఇతర దేశాల క్రికెటర్లను వేడుకుంటున్నానని కనేరియా అన్నాడు.