బాలికలతో బలవంతపు వ్యభిచారం కేసులో సంచలనం, డీఎస్పీ అరెస్ట్
అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల అంతర్రాష్ట్ర వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు.
By Srikanth Gundamalla Published on 16 May 2024 10:52 AM IST
బాలికలతో బలవంతపు వ్యభిచారం కేసులో సంచలనం, డీఎస్పీ అరెస్ట్
అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల అంతర్రాష్ట్ర వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. అయితే.. ఈ కేసులో ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందనే విషయం సంచలనంగా మారింది. ఇప్పటికే అరుణాచల్ పోలీసులు 21 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో రాష్ట్రానికి చెందిన ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కూడా ఉండటం సంచలనం రేపింది. కాగా.. ఈ కేసులో 10 నుంచి ఐదేళ్ల లోపు ఉన్న ఐదుగురు మైనర్లను రక్షించామని పోలీసులు బుధవారం వెల్లడించారు.
ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటానగర్లో ఇద్దరు మహిళలు బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. అయితే.. వీరు అస్సాంలోని దేహాజీ నుంచి మైనర్లను తీసుకొచ్చారని ఎస్పీ రోహిత్ రాజ్బీర్ సింగ్ వెల్లడించారు. చింపులో మైనర్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తమకు మే 4వ తేదీన సమాచారం అందిందని చెప్పారు. దాంతో.. వరుసగా దాడులు నిర్వహించామనీ.. మైనర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలిందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే పలువురిని అదుపులోకి తీసుకోవడంతో పాటుగా బాధిత మైనర్లను రక్షించామని ఎస్పీ రాజ్బీర్ సింగ్ చెప్పారు.
ఉద్యోగాల పేరిట ధేమాజీ నుంచి మైనర్ బాలికలను తీసుకొచ్చినట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఆ త్వాత వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని అన్నారు. ఈ విషయం స్వయంగా బాధిత బాలికలే చెప్పారన్నారు. అయితే.. ఈ వ్యభిచార రాకెట్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్కు కూడా సమాచారం ఇచ్చారని చెప్పారు. రక్షించిన ముగ్గురు మైనర్ బాలికలను వసతి గృహానికి తరలించామనీ ఎస్పీ చెప్పారు. ఇక ముందుగా వ్యభిచార గృహ నిర్వహణతో సంబంధం ఉన్న 10 మందిని అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత విచారణలో భాగంగా ఈ కేసుతో సంబంధం ఉన్న 11 మంది విటులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.