కువైట్‌లో రోడ్డుప్రమాదం, ఏపీకి చెందిన కుటుంబం మృతి

కువైట్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

By Srikanth Gundamalla  Published on  26 Aug 2023 2:22 AM GMT
Family, died,  kuwait, Car Accident,

Family died in kuwait Car Accident

కువైట్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. నలుగురంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.

కువైట్‌లో ఇటీవల రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు గౌస్‌బాషా (35)తో పాటు అతని భార్య (30), ఇద్దరు కుమారులు మృతిచెందినట్లు తెలుస్తోంది. గౌస్‌బాషా రాజంపేటలోని ఎగువగడ్డలో న్న అవ్వాతాతల వద్ద ఉండి స్థానిక పాఠశాలలో టెన్త్‌ వరకు చదివాడని సమాచారం అందుతోంది. ఆ తర్వాత తన స్వగ్రామం మదనపల్లెకు వెళ్లాడు గౌస్‌బాషా. అక్కడే ఉండి కొన్నేళ్ల తర్వాత బెంగళూరు వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. వివాహం అనంతరం గౌస్‌బాషా అక్కడే స్థిరపడ్డాడు. ఆ తర్వాత బెంగళూరు నుంచి బతుకుదెరువు కోసం కువైట్‌కి వెళ్లాడు గౌస్‌బాషా. అక్కడ కారులో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో గౌస్‌బాషాతో పాటు అతని భార్య ఇద్దరు కుమారులు మృత్యువాతపడినట్లు సమాచారం అందుతోంది. అయితే.. రోడ్డుప్రమాదం జరిగింది వాస్తవమే అని, మృతిచెందినట్లు చెబుతున్న వ్యక్తికి ఫోన్‌ చేస్తే అందుబాటులోకి రావడం లేదని బంధువులు చెబుతున్నారు. దాంతో.. వారు చనిపోయే ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. వారి మృతదేహాలను చూసే వరకు నిర్ధారించలేమని గౌస్‌బాషా సమీప బంధువులు అంటున్నారు. ఈ క్రమంలో అధికారులు చర్యలు తీసుకొని.. కువైట్‌లో ఈ ప్రమాదం గురించి ఆరా తీయాలని వారు కోరుతున్నారు. ఒక వేళ వారు గౌస్‌బాషా కుటుంబమే అయితే వెంటనే ఏపీకి వారి మృతదేహాలను తీసుకొచ్చేలా చూడాలని సమీప బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story