బహదూర్‌పురా: పాప కిడ్నాప్‌ కథ సుఖాంతం, 4 గంటల్లోనే నిందితుల అరెస్ట్

హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో ఓ 18 నెలల చిన్నారి కిడ్నాప్‌ కథ సుఖాంతం అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  26 Dec 2023 9:59 AM GMT
bahadurpura, child, kidnap case, two arrested,

బహదూర్‌పురా: పాప కిడ్నాప్‌ కథ సుఖాంతం, 4 గంటల్లోనే నిందితుల అరెస్ట్

హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో ఓ 18 నెలల చిన్నారి కిడ్నాప్‌ కథ సుఖాంతం అయ్యింది. కేవలం 4 గంటల్లోనే నిందితులను అరెస్ట్‌ చేశారు బహదూర్‌పురా పోలీసులు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు.

తన కూతురుకి పిల్లలు పుట్టాలని ఓ తల్లి ఎంతో తల్లడిల్లింది. ఎందరో దేవుళ్లను మొక్కింది.. చాలా ప్రార్థనలు చేసింది. దానధర్మాలు కూడా చేసింది. కానీ.. ఎలాంటి ఉపయోగం లేకపోయింది. కూతురుకు సంతానం కలగలేదు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో బహదూర్‌పురా పోలీస్‌ స్టేషన్ పరిధిలోని కిషన్‌బాగ్‌కు చెందిన నసీమ్‌ బేగం (60) అనే మహిళ తన కూతురు ఆయేషా (32)తో కలిసి మార్కెట్‌కు వెళ్లింది. అక్కడే ఒంటరిగా ఒక 18 నెలల చిన్నారి కనిపించింది. పక్కన పెద్దవారు ఎవరూ లేకపోవడంతో నసీమ్‌ బేగం ఆ చిన్నారిని ఎత్తుకు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది.

అయితే.. చిన్నారి కుటుంబ సభ్యులు పార్క్‌ను చూసేందుకు వచ్చారు. అదే సమయంలో చిన్నారిన నానమ్మ టికెట్లు తీసుకుంటున్న సమయంలో పాప అక్కడి నుంచి మిస్‌ అయ్యింది. చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించలేదు. కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. జరిగిందంతా పోలీసులకు చెప్పారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పాప కనిపించకుండా పోయిన ప్రాంతంలో ఉన్న మొత్తం 80 సీసీ కెమెరాలను పరిశృలించారు. అందులో ఒక మహిళ చిన్నారిని ఎత్తుకుని వెళ్లిపోవడాన్ని గమనించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్‌ను మిగతా పోలీసులకు పంపి అలర్ట్‌ చేశారు. ఈ క్రమంలోనే కేవలం కొద్ది గంటల్లోనే నిందితులను తాడ్‌బన్‌ ఎక్స్‌రోడ్డు వద్ద గుర్తించారు. పాపను సురక్షితంగా కాపాడారు. చివరకు చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

కాగా.. కిడ్నాప్‌కు పాల్పడ్డ నసీమ్‌ బేగంకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు మగవారు కాగా ఇద్దరు ఆడవారు ఉన్నారు. వీరిలో పెద్దకూతురే ఆయేషా బేగం. 8 ఏళ్ల క్రితమే వివాహం చేసినా ఇంకా పిల్లలు పుట్టలేదు. తన కూతురికి పిల్లలు కావాలనే ఉద్దేశంతోనే కిడ్నాప్‌ చేశాననీ పోలీసుల విచారణలో తేల్చింది వసీమ్‌ బేగం. ఈ కేసులో నసీమ్‌ బేగంతో పాటు.. ఆమె కూతురు ఆయేషాను అదుపులోకి తీసుకున్నారు.


Next Story