అగ్ని పర్వతం సాక్షిగా ఒకటయ్యారు
By Newsmeter.Network Published on 17 Jan 2020 6:24 AM GMTపెళ్లంటే జీవితంలో మరచిపోలేని ఒక జ్ఞాపకం.. దానిని మరింత అందంగా మార్చుకోవటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రయత్నిస్తారు. తమ పెళ్లి తమకే కాదు, చూసిన వాళ్లకి కూడా మరుపురాని అనుభూతిని కలిగించేలా ప్లాన్ చేసుకుంటారు. అలా ఆలోచించిన ఓ జంట అగ్ని సాక్షిగా కాదు ఏకంగా అగ్నిపర్వతం సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఆశ్చర్యపోతున్నారా.. మీరు విన్నది నిజమే.. ఈ వింత ఘటన ఫిలిప్పిన్స్ లో చోటుచేసుకుంది.
అగ్నిపర్వతం పేలిన వెంటనే అధికారులు వచ్చి.. అక్కడున్న జనాలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరించారు. కానీ, ఆ జంట అతిథులకు ధైర్యం చెప్పి.. వారిని అక్కడే ఉండేలా చేసి పెళ్లిని ఘనంగా జరుపుకున్నారు. అగ్నిపర్వతానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో వీరి వివాహం జరగడం అద్భుతం.
అందరూ అక్కడ ఉండటానికి ఒప్పుకున్నారనే గాని.. ఏ క్షణంలో ఏ జరుగుతుందో అనే భయంతో వణికిపోయారు. అయినా కానీ సోషల్ మీడియాలో వచ్చే అప్డేట్స్ చూస్తూ పెళ్లి అయ్యేవరకు అక్కడే ఉండి పెళ్లైన వెంటనే అక్కడినుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ఇంతకీ ఈ అగ్నిపర్వతం ఎక్కడుందో తెలుసా ఫిలిప్పీన్స్ దేశంలో తాల్ సరస్సులోని ల్యూజన్ ఐలాండ్లో. ఇది గత కొంతకాలంగా రగులుతోంది. 1572లో ఈ పర్వతం మొదటి పేలుడు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి . అప్పటి నుంచి ఇప్పటివరకు గడచిన 450 ఏళ్లలో కనీసం 34 సార్లు పేలింది. పైగా ఇది ప్రపంచంలోని చిన్న అగ్ని పర్వతాల్లో ఒకటి. దాదాపు యాభై ఏళ్ల క్రితం కొన్ని నెలలపాటు వరుసగా పేలింది. 1911లో పేలినప్పుడు 1,500 మంది వరకు చనిపోయారు. ప్రస్తుతం ఈ పర్వతం నుంచి వెలువడుతున్న బూడిద 16.8 కిలోమీటర్ల మేర ఎగసిపడుతోంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా సిటీకి 70 కిలోమీటర్ల 267 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన సరస్సు లో తాల్ అగ్నిపర్వతం ఉంది. తరచు జరిగిన పేలుళ్లతో సరస్సులో చాలా వరకు లావా బూడిద నిండి ఉంటుంది. 1968లో ఈ పర్వతం నుంచి భారీ మొత్తంలో లావా పెల్లుబుకిందని తెలుస్తోంది.
అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో జరిగిన ఈ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.