చంద్రబాబుకు కరోనా స్ర్కీనింగ్‌ టెస్ట్!

By Newsmeter.Network  Published on  17 March 2020 8:57 AM GMT
చంద్రబాబుకు కరోనా స్ర్కీనింగ్‌ టెస్ట్!

ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కరోనా స్ర్కీనింగ్‌ టెస్ట్ నిర్వహించారు. ఎందుకు..? చంద్రబాబు కు కరోనా వైరస్‌ సోకిందా అనుకొనేరు.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. టీడీపీ అధినేత ఎప్పుడూకూడా అప్డేటెడ్‌గా ఆలోచిస్తుంటారు. అందుకు ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. భారత్‌లోనూ ఈ కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తుంది. ఇప్పటికే దేశంలో 125 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ముగ్గురు మృతిచెందారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది. ఏపీలో ఒకరికి, తెలంగాణలో నలుగురికి ఈ వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో మంగళగిరిలో ఉన్న రాష్ట్ర పార్టీ కార్యాలయంలోకి వచ్చే వారికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్ నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి పరీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కార్యాలయంలోకి వెళ్లేందుకు అక్కడి సిబ్బంది కరోనా స్ర్కీనింగ్‌ టెస్ట్ నిర్వహించారు. చంద్రబాబుతోపాటు కార్యాలయంలోకి వెళ్లే ప్రతీ ఒక్క నేతకు, ప్రతీ ఒక్క కార్యకర్తకు స్ర్కీనింగ్‌ టెస్ట్ నిర్వహించి లోపలికి పంపిస్తున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రతీరోజూ పార్టీ కార్యాలయంకు వందలాది మంది కార్యకర్తలు వస్తుంటారు. కాబట్టి స్ర్కీనింగ్‌ ఏర్పాటు చేశారు. అలాగే శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు మా నేత రూటే సపరేట్‌ అంటూ కొనియాడుతున్నారు.

Next Story