కరోనా.. అతడికి గతాన్ని గుర్తుకు తెచ్చింది!

By Newsmeter.Network  Published on  21 March 2020 10:32 AM GMT
కరోనా.. అతడికి గతాన్ని గుర్తుకు తెచ్చింది!

కరోనా వైరస్‌ ఓ వ్యక్తికి గతాన్ని గుర్తుకు తెచ్చింది. మీరు వింటుంది నిజమే.. అదేంటి.. కరోనా వైరస్‌ ప్రాణాలు తీస్తుంది కానీ.. గత్తాన్ని గుర్తుకు తేవడం ఏమిటనుకుంటున్నారా..? మీకు ఎన్ని డౌట్లు వచ్చినా.. ఇదిమాత్రం నిజం..! మతిమరుపుతో కుటుంబానికి దూరమైన వ్యక్తి 30 ఏళ్ల తరువాత మళ్లీ తన కుటుంబాన్ని కలుసుకోబోతున్నాడు.. దీనికి కారణం.. అతని గ్రామంలో కరోనా వైరస్‌తో ఓ వ్యక్తి మృతిచెందటమే. ఆసక్తికరమైన ఈ వార్త ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది..

వివరాల్లోకి వెళితే.. చైనాలోని గియిజు ప్రావిన్స్‌ చిఘ గ్రామానికి చెందిన 57ఏళ్ల జియామింగ్‌ 1990లో ఉపాధి కోసం తన స్వగ్రామాన్ని వదిలి హుబెయి ప్రావిన్స్‌కు వెళ్లాడు. అదే ఏడాది పనిచేసే చోట ప్రమాదవశాత్తూ మెదడుకు దెబ్బ తగలడంతో గతాన్ని మర్చిపోయాడు. కొద్ది రోజుల తరువాత జియామింగ్‌ కోలుకున్నప్పటికీ గతాన్ని మర్చిపోవడం, అతడి గుర్తింపు కార్డులు పోవటంతో నిలువ నీడలేకుండా దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఇదే సమయంలో ఓ కుటుంబం జియామింగ్‌ను చేరదీసింది. ఆ కుటుంబంతో జియామింగ్‌ కలిసిపోయినప్పటికీ తన స్వగ్రామం, కుటుంబం, మర్చిపోయిన గతం గురించి తీవ్రంగా ఆలోచించేవాడు. అయినా గుర్తుకు రాకపోయేది. 2015లో వారంతా హిజియంగ్‌ ప్రావిన్స్‌లోని యునెకు వెళ్లారు. ఆ ప్రాంతం జియమింగ్‌ ఊరికి 1500కి.మీ దూరంలో ఉంది.

Also Read :అలా వద్దు.. ఇలా చేయండి..!.. ప్రధాని వీడియో మెస్సేజ్‌

ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న విషయం విధితమే. కరోనా వ్యాధి భారిన పడి ఆదేశంలో సుమారు ౩వేలకు పైగా చనిపోయారు. ఈ క్రమంలో ఎక్కడెక్కడ కరోనా మరణాలు చోటు చేసుకున్నాయో వార్తలో వివరించారు. జియామింగ్‌ సొంత ఊరు చిఘలో ఒకరు మృతిచెందడంతో.. ఆ ఊరిపేరు వార్తల్లో వచ్చింది. ఇది చూసిన జియమింగ్‌ తన గ్రామమేనని గుర్తుపట్టాడు. దీంతో ఆ వెంటనే అతనికి గతం గుర్తుకు వచ్చింది. ఆలస్యం చేయకుండా స్థానిక పోలీసులకు తెలిపాడు. అతడి కుటుంబ సభ్యుల చిరునామా, వివరాలు సేకరించిన పోలీసులు, వీడియోకాల్‌ ద్వారా జియామింగ్‌ను తన తల్లితో మాట్లాడించారు. జియామింగ్‌కు నలుగురు అక్కాచెళ్లెల్లు ఉన్నారు. జియామింగ్‌ తప్పిపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అయిన ఫలితం లేకపోయింది. ఇప్పుడు కుటుంబ సభ్యులను కలుస్తుండటంతో జియామింగ్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అతడ్ని కుటుంబానికి కలిపే ప్రయత్నంలో పోలీసులున్నారు. మొత్తానికి కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణిస్తుంటే.. జియామింగ్‌కు మాత్రం తన కుటుంబాన్ని కలిపింది. ఈ వార్త ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Next Story