కొరియాలో విఝృంభిస్తోన్న కరోనా
By రాణి Published on 21 Feb 2020 10:41 AM IST
కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే ఈ వైరస్ దెబ్బకు దాదాపుగా 2000 మందికి పైగా మరణించారు. 80 వేలమంది వరకు వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. చైనాలోనే జన్మించిన సార్స్ వైరస్ సృష్టించిన బీభత్సం కంటే కూడా కరోనా సృష్టించిన కల్లోలం మరింత భయానకంగా మారింది.
ఈ వైరస్ క్రమంగా కొరియాలో పెరుగుతున్నట్టుగా భావిస్తున్నారు. కొరియాలో ఇప్పటికి మొత్తం 62 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొరియాలో వాతావరణం కరోనా వైరస్ పెరిగేందుకు అనుగుణంగా చల్లగా ఉండటం ఇందుకు కారణం కావొచ్చు. దీంతో కొరియా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కేసులు నమోదైన దేశాల్లో చైనా తర్వాత థాయిలాండ్ ఐదో స్థానంలో ఉంది. దీని ప్రభావం థాయ్ పర్యాటక రంగంపై పడింది. ఏడాది పొడవునా, ముఖ్యంగా నవంబర్ నుంచి ఏప్రిల్ నెలల మధ్యలో పర్యాటక రంగానికి డిమాండ్ ఉండే థాయిలాండ్లో ఆలయాలు, బీచ్లు, రిసార్టులు ఇప్పుడు సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి.
ఇక తాజాగా చైనాలో నాలుగు నెలల శిశువు కరోనాను జయించింది. తూర్పు చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన నాలుగు నెలల జింగ్జింగ్లో కొద్ది రోజుల కిందట కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆ శిశువును చిన్నారుల ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పసికందు ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా లక్షణాలు శిశువులో కనిపించలేదు. దీంతో గురువారం జింగ్జింగ్ను ఆమె తండ్రికి అప్పగించారు.
మరోవైపు జూన్ 30 వరకు ఢిల్లీ - షాంఘై విమాన సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా గురువారం ప్రకటించింది. ఢిల్లీ - హాంకాంగ్ విమానాన్ని కూడా జూన్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.