బెయిల్ పై విడుదలైన రేవంత్ రెడ్డి
By రాణి Published on 18 March 2020 1:38 PM GMTమల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం బెయిల్ పై చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న రేవంత్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో భారీ బందోబస్త్ తో ప్రత్యేక కాన్వాయ్ లో రేవంత్ ను పోలీసులు ఇంటికి చేర్చారు. వివిధ జిల్లాల నుంచి రేవంత్ కోసం జైలు వద్దకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి..వారందరినీ పంపించే ప్రయత్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో..చేసేది లేక 144 సెక్షన్ విధించినట్లు తెలుస్తోంది.
Also Read : కౌలాలంపూర్ నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు..
కాగా..గత 14 రోజులుగా రేవంత్రెడ్డి చర్లపల్లి జైలులోనే ఉన్నారు. మొదటగా కూకట్పల్లి కోర్టు రేవంత్రెడ్డి బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చిన విషయం తెలిసిందే. జన్వాడలోని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్పై డ్రోన్ కెమెరా ఎగరవేసిన కేసులో ఏ-1 నిందితుడిగా ఎంపీ రేవంత్రెడ్డి ఉన్నారు. ఈ కేసులో రేవంత్రెడ్డికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో రేవంత్ రెడ్డిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో 8 మందిని నిందితులుగా అనుమానిస్తూ నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ వాడినందుకు ఈ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రేవంత్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 184, 187, 11 రెడ్విత్ 5ఏ, ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
Also Read : బిగ్ బ్రేకింగ్ : రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలు బంద్