బాణాసంచా తయారీ కేంద్రాలపై సీఎం జగన్‌ ఆరా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 12:37 PM GMT
బాణాసంచా తయారీ కేంద్రాలపై సీఎం జగన్‌ ఆరా

అమ‌రావ‌తి: తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం జి.వేమవరం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై సీఎం వైఎస్ జ‌గ‌న్‌ ఆరా తీశారు. గడ‌చిన 20 రోజుల్లో 2 ప్రమాదాలు జరగడంపై సీఎం జ‌గ‌న్ చర్చించిన‌ట్లు వ్య‌వ‌సాయ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బాణాసంచా తయారీ కేంద్రాల్లో వెంటనే తనిఖీలు చేయాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారని కన్నబాబు పేర్కొన్నారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో లోపాలు ఉంటే వెంటనే సీజ్ చేయాలన్నారు. వేమవరం ప్రమాద ఘటనలో బాధితులను ఆదుకోవాలని, అలాగే బాణసంచా తయారీ కేంద్రాల్లో అనుమతులపై ఫైర్, పోలీస్ శాఖ‌లు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సీఎం ఆదేశించిన‌ట్లు కన్నబాబు తెలిపారు. ప్ర‌భుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లోపాలు ఉన్నా ఉపేక్షించేది లేద‌న్నారు. దీపావళి పండ‌గ నేపథ్యంలో బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలు, అమ్మకాల వద్ద భద్రతా ప్రమాణాలపై నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించామ‌న్నారు. శుక్ర‌వారం జ‌రిగిన ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంద‌ని మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు వెల్ల‌డించారు.

Next Story