విషాదం: కుటుంబాన్ని చిదిమేసిన రోడ్డు ప్రమాదం

By సుభాష్  Published on  5 Sep 2020 7:45 AM GMT
విషాదం: కుటుంబాన్ని చిదిమేసిన రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీలేరు సమీపంలో కేవీపల్లి మండలం గ్యారంపల్లి సమీపంలో ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పీలేరు వైపు నుంచి కడప జిల్లా రాయచోటి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం అదే మార్గంలో వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒక చిన్నబాబుతో పాటు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, శనివారం ఒక్క రోజే పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపూర్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న బస్సు చెరీఖడీ సమీపంలో ఒక ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినట్లు తెలుస్తోంది.ఈ బస్సు ఒడిశాలోని గంజాం నుంచి గుజరాత్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయ్యింది.

అలాగే హిమాచల్‌ ప్రదేశ్‌లో శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో వెళ్తున్న ఓ కారు లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఖరెగలాలో ఒక బొలెరో వాహనం అదుపు తప్పి లోయలో పడటంతో నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇలా ప్రతి రోజు దేశంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ప్రమాదాలు జరుగకుండా ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది.

Next Story