నవంబర్‌ నాటికి చైనా వ్యాక్సిన్‌..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sep 2020 7:37 AM GMT
నవంబర్‌ నాటికి చైనా వ్యాక్సిన్‌..!

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి జన జీవనం అస్తవ్యస్తమైంది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. చైనాలో అభివృద్ధి చేస్తున్న నాలుగు కరోనా వైరస్‌ వ్యాక్సిన్లు నవంబర్‌ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని సీడీసీ( చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని.. ఇవి నవంబర్‌ లేదా డిసెంబర్‌ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చైనా సీడీసీ బయోసేప్టీ నిపుణులు ఓకరు అక్కడి అధికారిక మీడియాలో తెలిపారు.

వీటిలో మూడింటిని ఇప్పటికే అత్యవసర సేవలు అందిస్తున్న వారికి ఇచ్చామని.. జూలై నెలలోనే ఈ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక ఏప్రిల్‌లో స్వయంగా తానే ప్రయోగాత్మక వ్యాక్సిన్ తీసుకున్నానని ఆ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు తనకు ఎలాంటి అసాధారణ లక్షణాలు కనిపించలేదన్నారు. అయితే.. ఈ నాలుగు వ్యాక్సిన్లలో ఏ వ్యాక్సిన్‌ తీసుకున్నారనే సంగతి మాత్రం ఆమె వెల్లడించలేదు. ఔషధ దిగ్గజం చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ (సినోఫార్మ్), యూఎస్‌ కాన్సినో బయోలాజిక్స్ 6185 లు కలిసి వ్యాక్సిన్లను అభివృద్ది చేశాయి. మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ముగిసిన తరువాత 2020 చివరి నాటి ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సినోఫార్మ్‌ జూలైలోనే ప్రకటించింది.కరోనా వైరస్‌కు మందు కనిపెట్టడానికి ఇప్పటికే పలుదేశాలు పోటీపడుతున్నాయి. కాగా.. రష్యా ఇప్పటికే వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

Next Story