చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు
By సుభాష్ Published on 27 Feb 2020 12:46 PM GMTటీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీఐపీ లాంజ్కు తీసుకెళ్లారు. ఈ మేరకు వెనక్కి పంపడానికి గల కారణాలను తెలుపుతూ చంద్రబాబుకు లేఖ అందజేశారు పోలీసులు. 151 సెక్షన్ కింద ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
భద్రతా పరమైన కారణాల దృష్ట్యా అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు వెళ్లిన చంద్రబాబును విమానాశ్రయం దగ్గరలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే. బాబు కాన్వాయ్ను అడ్డుకున్న వారు చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు రెండు గంటల పాటు కారులోనే ఉండిపోయారు. ఆ తర్వాత రోడ్డుపై బైఠాయించారు. వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జగన్ సర్కార్పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు దిగుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు కనుక తిరుగుబాటు చేస్తే ఎవ్వరు ఏమి చేయలేరని అన్నారు.