చంద్రబాబు నివాసమూ అక్రమ కట్టడమే - మంత్రి బొత్స
By న్యూస్మీటర్ తెలుగు Published on 23 Sep 2019 3:03 PM GMTఅమరావతి: కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలు పై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి బొత్స. నదీ పరివాహక చట్టాలకు విరుద్దంగా కరకట్ట లోపల ఉన్న అక్రమ కట్టడాలను తొలగించే ప్ర క్రియ ప్రారంభించామన్నారు . చట్ట వ్యతిరేకమైన నిర్మాణాలకు గతంలోనే సీఆర్డీఏ నోటీసులు జారీ చేసిందన్నారు. దీనితో కొందరు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారని చెప్పారు. చట్టపరంగా, కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిలో భాగంగానే పాతూరు కోటేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన అక్రమ కాంక్రీట్ నిర్మాణాన్ని సీఆర్డీఏ అధికారులు తొలగించారన్నారు.
అయితే..మాజీ సీఎం చంద్రబాబు నివాసాన్నే కూలుస్తున్నట్లు ఒక వర్గం మీడియా రాజకీయం చేస్తుందన్నారు మంత్రి బొత్స. చంద్రబాబు ఉంటున్న లింగమనేని రమేష్ కు చెందిన అతిధిగృహం కూడా నదీ పరీవాహక చట్టాలకు విరుద్దంగా నిర్మించిదేనన్నారు. ఈ భూమిని లింగమనేని రమేష్ పూలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చారని చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
అయితే.. సీఆర్డీఏ రికార్డుల ప్రకారం సదరు భూమికి లింగమనేని రమేష్ యజమానిగా వున్నారని చెప్పారు మంత్రి బొత్స. ఈ మేరకే ఆయన పేరు మీద అక్రమ కట్టడానికి నోటీస్ ఇచ్చారని మంత్రి వివరించారు. లింగమనేనికి చెందిన అతిథిగృహంతో పాటు ఏడుగురు అక్రమ కట్టడాల యజమానులకు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసిందన్నారు. త్వరలోనే వాటిని కూడా తొలగిస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నదీ పరీవాహక పరిరక్షణ చట్టాల విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని మంత్రి బొత్స చెప్పారు.