'బంగారం'పై కేంద్రం బంగారంలాంటి వివరణ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 4:02 PM GMT
బంగారంపై కేంద్రం బంగారంలాంటి వివరణ..!

బంగారం లెక్కలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గోల్డ్ నిల్వలపై పరిమితులు విధించే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. పరిమితికి మించిన స్వర్ణాన్ని స్వచ్చందంగా వెల్లడించడానికి ఎలాంటి పథకం తీసుకురావడం లేదని తేల్చి చెప్పింది. బంగారంపై క్షమాభిక్ష పథకం తీసుకువచ్చే ప్రతిపాదనేదీ లేదని వివరించింది. బంగారం పరిమితులపై వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని, ప్రభుత్వం అలాంటి ఆలోచనేమీ చేయడం లేదని తెలిపింది. బడ్జెట్ తయారీ సందర్భంగా ఇలాంటి ఊహాగానాలు రావడం సహజమేనని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

లెక్కల్లో చూపని పసిడిని బహిర్గతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వార్తలు వచ్చాయి. అక్రమంగా దాచుకున్న బంగారాన్ని బయటపెట్టడంతో పాటు పన్ను చెల్లించే అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. బంగారం నిల్వలపై పరిమితి విధించడానికి ప్రత్యేకంగా గోల్డ్‌ బోర్డును ఏర్పాటు చేయబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. పన్నులు ఎగ్గొట్టి, అక్రమంగా దాచుకున్న స్వర్ణంపై పన్నులు విధిస్తారని కూడా ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో కేంద్రప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనేమీ లేదని ఢిల్లీ వర్గాలు వివరించాయి.

Next Story