తండ్రిపై పోలీసులకి ఫిర్యాదు చేసిన 8 ఏళ్ల చిచ్చరపిడుగు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 9:16 AM GMT
తండ్రిపై పోలీసులకి ఫిర్యాదు చేసిన 8 ఏళ్ల చిచ్చరపిడుగు

నిజమాబాద్ : మా నాన్న కొడుతున్నాడంటూ.. ఓ 8 ఏళ్ల బాలుడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఏకంగా ఎస్సైకు ఫిర్యాదు చేశాడు. వర్నీ మండలం వడ్డేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివ, రుక్మిణి దంపతుల కుమారుడు మహేష్. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు రావడంతోఇంట్లో మహేష్ ఆడుకుంటున్నాడు. దీంతో తండ్రి మందలించాడు. నన్నే మందలిస్తావా అంటూ 8 ఏళ్ల మహేష్ నేరుగా పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

నాన్న కొడుతున్నాడని అక్కడే ఉన్న ఎస్సైను కలవడంతో ఎస్సైతో పాటు ఇతర పోలీసు సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆరా తీస్తే గతంలో పలుమార్లు అమ్మనాన్నతో కలిసి బాలుడు పోలీస్‌స్టేషన్ కు వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. కుటుంబ తగాదాల కారణంగా తరుచూ తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ కు రావడం, అతనిముందే పోలీసులు వారిని సముదాయించి పంపడం వంటివి చూసి ఆ అబ్బాయిని ప్రభావితం అయినట్టు తెలుస్తోంది.

దీంతో, సమస్య వస్తే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలన్న ఆలోచన బలంగా మహేష్ మనసులో నాటుకుపోయింది. దీంతో..అతను తండ్రిపైనే ఫిర్యాదు చేసినట్లు పోలీసులు భావించారు. వెంటనే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. ఈ సంఘటన వర్నీ మండలంలో చర్చనీయాంశం కాగా.. బాలుడు పోలీసు స్టేష‌న్ కు రావ‌డం.. కంప్లైంట్ ఇవ్వ‌డంపై ఎస్సై అనిల్‌రెడ్డి విస్తుపోయారు.

Next Story