బోటు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sep 2019 10:44 AM GMT
బోటు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం

విజయనగరం జిల్లా: తూ.గో జిల్లా బోటు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరదల కారణంగా బోటు ప్రయాణాలు గోదావరిలో నిషేధించినా బోటు వెళ్లడం దారుణమన్నారు. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తు లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు డిప్యూటీ సీఎం.

శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డారు...

బోటు ప్రమాదం నుంచి హైదరాబాద్‌కు చెందిన సీహెచ్‌ జానకి రామారావు ప్రాణాలతో బయటపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు.

“బ‍్రేక్‌ఫాస్ట్‌ చేసి అందరం కూర్చున్నాం. మరికొద్ది సేపట్లో పాపికొండలు వస్తాయని బోటు సిబ్బంది చెప్పారు. ప్రమాదంకు ముందే ఇది డేంజర్‌ జోన్‌... బోటు అటు, ఇటు ఊగుతుంది. మీరు భయపడాల్సిన పని లేదని చెప్పారు. అయితే ఇంతలోనే బోటు ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. దీంతో పాస్టిక్‌ కుర్చీల్లో కుర్చున్నవారంతా ఓ వైపుకు వచ్చేశారు. బరువు ఎక్కువ కావడంతో బోటు యథాస్థానంలోకి రాలేకపోయింది. అదే సమయంలో మొదటి అంతస్తులో ఉన్నవారంతా ఒక్కసారిగా రెండో అంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అది డ్రైవర్‌ తప్పిదమా లేకుంటే బోటు ఒరిగిపోవడమా అనేది స్పష్టంగా తెలియదు. ప్రమాదం జరిగిన వెంటనే నేను శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డాను.” అని జానకి రామరావు వివరించారు.

మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శ్రీనివాస కాలనీకి చెందిన జానకి రామారావు రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి. ఆయన తన భార్య జ్యోతితో కలిసి రెండు రోజుల క్రితం విహార యాత్రకు వెళ్లారు. ఈ ప్రమాదంలో భార్యతో పాటు బావమరిది, బావమరిది భార్య, వారి కుమారుడు గల్లంతు కాగా, జానకి రామారావు సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు ఈ ప్రమాద వార్తతో శ్రీనివాస కాలనీలో విషాదం నెలకొంది. మరోవైపు హయత్‌ నగర్‌కు చెందిన విశాల్‌, ధరణీ కుమార్‌, అర్జున్‌, లడ్డు గల్లంతు అయ్యారు.

Next Story