కంగనా కార్యాలయం కూల్చివేత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sep 2020 7:43 AM GMT
కంగనా కార్యాలయం కూల్చివేత

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు బీఎంసీ(బృహణ్ ముంబై కార్పొరేషన్) అధికారులు షాకిచ్చారు. ముంబైలోని కంగనా కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్దంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కార్యాలయన్ని కూల్చివేశారు. ముంబైలో కంగనా నిర్మించుకున్న మణికర్ణిక కార్యాలయంలోని కొన్ని నిర్మాణాలకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోలేదని ప్రకటించిన బీఎంసీ అధికారులు మంగళవారం ఆమె ఆఫీస్‌ గేటుకు నోటీసులు అంటించారు.

ఈ నోటీసులపై స్పందించిన కంగనా.. ఇవాళ వరకైతే బుల్డోజర్లతో రాలేదని మంగళవారం ట్వీట్ చేసింది. తన కార్యాలయ కూల్చివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కంగనా మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. ఇంతలోనే.. బీఎంసీ అధికారులు కూల్చివేత ప్రక్రియను మొదలుపెట్టడం గమనార్హం.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగన మండిపడింది. ముంబైలోని తన కార్యాలయాన్ని ప్రభుత్వం చట్టవిరుద్దంగా కూల్చివేస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేసింది. బుధవారం కంగన మనాలి నుంచి ముంబాయికి రానుంది. ఈ క్రమంలో తన ఆఫీసును కూల్చుతున్నారంటూ ఫోటోలు షేర్‌ చేసింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. కానీ ముంబై అనేది మరో పీఓకే అనే విషయాన్ని తన శత్రువులు పదేపదే నిరూపిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'బాబర్, అతని సైన్యం' అంటూ కూల్చివేతకు వచ్చిన పోలీసులు, అధికారులు, సిబ్బంది ఫొటోలను షేర్ చేసింది. తనకు ఆస్తి అనేది చిన్న విషయం అని, ఇవేవీ తన ఆత్మ స్థైర్యాన్ని తగ్గించవు. ఇంకా పెంచుతాయి తెలిపింది.

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసుకు సంబంధించి బాలీవుడ్‌లో డ్రగ్స్‌ తీసుకుంటున్నారంటూ కూడా ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రాణహాని ఉందని.. కేంద్ర ప్రభుత్వం వై ఫ్లస్‌ కేటగిరి సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.



Next Story