ఫైనల్‌కు ఆస్ట్రేలియా వచ్చేసింది..

By Newsmeter.Network
Published on : 5 March 2020 5:48 PM IST

ఫైనల్‌కు ఆస్ట్రేలియా వచ్చేసింది..

మహిళల టీ20 ప్రపంచ కప్‌కు అతిథ్యం ఇస్తున్న ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకొచ్చింది. గురువారం సిడ్నిలో దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో(డక్‌వర్త్‌ లూయిస్ పద్దతిలో‌) ఆసీస్‌ విజయం సాధించింది. ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం వర్షం పడడంతో మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా నిర్ణీత 13 ఓవర్లలో 98 పరుగులు చేయాల్సి ఉండగా.. 92 పరుగులే చేసింది. దీంతో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఆదివారం ఫైనల్‌లో టీమ్‌ఇండియాతో అమీతుమీ తేల్చుకోనుంది.

అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్‌ కూడా వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఇదే మైదానంలో జరగాల్సిన తొలి సెమీస్‌ వర్షం కారణంగా రద్దయింది. అయితే రెండో సెమీస్‌ మ్యాచ్‌ ప్రారంభసమయానికి మైదానాన్ని సిబ్బంది సిద్దం చేశారు. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెన‌ర్లు మూనీ (28), అలీసా హీలి (18) శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 34 ప‌రుగులు జోడించారు. అనంతరం ఆసీస్‌ కెప్టెన్ సారథి మెగ్‌ లానింగ్‌ (49 నాటౌట్‌) చివరి వరకు నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించింది. చివర్లో హేన్స్ (17) ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఆసీస్‌ 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం వర్షం కురిసింది. దీంతో చాలా సేపు ఆటకు అంతరాయం కలిగింది. దీంతో మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించి దక్షిణాఫ్రికాకు 98 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. 13 ఓవ‌ర్లు ఆడిన ప్రొటీస్ ఐదు వికెట్ల‌ కోల్పోయి 92 పరుగులు మాత్రమే చేసింది. లారా వోల్వ‌ర్ట్ (27 బంతుల్లో 41 నాటౌట్‌, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరిపోరాటం చేసినా దక్షిణాఫ్రికాను గెలిపించలేకపోయింది. ఇక ఆసీస్‌ ఆదివారం ఫైనల్‌లో టీమ్‌ఇండియాతో అమీతుమీ తేల్చుకోనుంది.

ఇప్పటికే నాలుగు సార్లు టీ20 వరల్డ్‌కప్‌ సాధించినా ఆసీస్‌ ఐదో సారి వరల్డ్‌కప్‌ సాధించాలని ఆరాటపడుతుండగా.. తొలి సారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడాలని టీమ్‌ఇండియా ఉవ్విళ్లూరుతుంది.

Next Story