బయోడైవర్సిటీ యాక్సిడెంట్ బాధితురాలికి సీఎం జగన్ చేయూత...

By అంజి  Published on  25 Nov 2019 3:49 PM GMT
బయోడైవర్సిటీ యాక్సిడెంట్ బాధితురాలికి సీఎం జగన్ చేయూత...

హైద‌రాబాద్: బ‌యో డైవ‌ర్సిటీ ప్లైఓవ‌ర్ పై ఘోర కారు ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ఓ మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా.. అనంత‌పురానికి చెందిన కుబ్రా బేగం అనే యువ‌తి తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. కుబ్రా బేగంకు ఆప‌రేష‌న్ నిమిత్తం రూ.5ల‌క్ష‌లు ఖ‌ర్చ‌వుతాయ‌ని వైద్యులు తెలిపారు. పెయింట‌ర్ పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న ఆ యువ‌తి తండ్రి అబ్దుల్ అజీమ్ కు అంత డ‌బ్బు చెల్లించి ఆప‌రేష‌న్ చేయించ‌లేని స్థితిలో ఉన్నాడు. దీంతో త‌న బిడ్డ‌ను కాపాడుకునేందుకు ఎవ‌రైనా సాయం చేస్తారేమోన‌ని అబ్దుల్ అజీమ్ ఎదురుచూస్తుండ‌గా.. కుబ్రా బేగం ఆరోగ్య ప‌రిస్థితిని ఓ వైసీపీ కార్య‌క‌ర్త సీఎం దృష్టికి తీసుకెళ్లాడు. విష‌యం తెలుసుకున్న సీఎం వైఎస్ జ‌గ‌న్ కుబ్రా బేగం ఆప‌రేష‌న్ కోసం తక్షణమే కావలసిన డబ్బును సీఎం ఫండ్ ద్వారా అందచెయ్యాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆపరేషన్ తర్వాత కూడా యువతి తిరిగి సాధారణ స్థితికి చేరుకునేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తమ కూతురు ఆపరేషన్ కోసం సీఎం వైఎస్ జగన్ సాయం చెయ్యడానికి ముందుకొచ్చిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. సాయం కోసం ఎదురుచూస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు ఆపద్భాంధవుడిలా వచ్చిన సీఎం జగన కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story