వినుకొండ ఘటనపై జగన్ సీరియస్.. రాష్ట్రపతికి వైసీపీ ఫిర్యాదు
పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 July 2024 1:30 PM IST
వినుకొండ ఘటనపై జగన్ సీరియస్.. రాష్ట్రపతికి వైసీపీ ఫిర్యాదు
పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం చోటుచేసుకుంది. వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైసీపీ యువజన విభాగం నాయకుడు రషీద్ను నడిరోడ్డుపై కిరాతకంగా చేతులు, మెడ నరికి చంపేశాడు జిలాన్. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతి క్రూరంగా మర్డర్ చేవాడు. రెండు చేతులు తెగి రోడ్డుపై పడి.. మెడకు తీవ్రమైన గాయంతో రక్తపు మడుగులో పడి రషీద్ ప్రాణాలు విడిచాడు.
ఈ ఘటనపై తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందంటూ కూటమి ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. లా అండర్ ఎక్కడ ఎక్కడా కనిపించడం లేదంటూ ఎక్స్ పోస్టుపెట్టారు. వైసీపీని అణగదొక్కాలనే కూటమి ప్రభుత్వం ఇలా దారుణంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. రాజకీయ కక్షలతో దాడులు చేస్తున్నారనీ.. విధ్వంసాలకు ఏపీని చిరునామాగా మారుస్తున్నారని జగన్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులందరూ రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఎవరి స్థాయిలో వారు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్షా ఏపీలో శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని కోరారు. ఇక వైసీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానంటూ ఎక్స్వేదికగా ఆ పార్టీ అధినేత జగన్ భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు,…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 18, 2024
మరోవైపు వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కూడా వినుకొండ ఘటనపై స్పందించి రాష్ట్రపతిని ట్యాగ్ చేసింది. '‘మేడం ప్రెసిడెంట్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్’ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైసీపీ ట్వీట్ చేసింది. రాష్ట్రపతి కలగజేసుకుని ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేసింది.