కుప్పంలో ఇంట్లో నాటు బాంబు పేలుడు కలకలం
చిత్తూరు జిల్లాలోని కుప్పంలో భారీ పేలుడు కలకలం రేపింది. కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలో
By Srikanth Gundamalla Published on 26 Jun 2023 11:48 AM IST
కుప్పంలో ఇంట్లో నాటు బాంబు పేలుడు కలకలం
చిత్తూరు జిల్లాలోని కుప్పంలో భారీ పేలుడు కలకలం రేపింది. కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలో ఉన్న ఓ ఇంట్లో నాటు బాబు పేలింది. బాంబు పేలుడుతో భారీగా శబ్ధం వినిపించింది. నాటు బాంబు పేలడంతో స్థానిక జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లో నివాసం ఉంటోన్న మురుగేష్, ధనలక్ష్మి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. పేలుడు తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నాటుబాంబుతో పాటు జిలెటిన్ స్టిక్స్ కూడా పేలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి గాయపడ్డ దంపతులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు.
గుర్తు తెలియని దండగులు ఆ దంపతుల ఇంటి గుమ్మం వద్ద నాటు బాంబు, జిలెటిన్స్టిక్స్ పెట్టి పేల్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మురుగేష్ ఇంటి వద్ద దుండగులు భారీ పేలుడు పేల్చడం వెనుక అసలు కారణమేంటి..? ఆ దుండగులు ఎవరు..? ఎందుకు దంపతులను చంపే ప్రయత్నం చేశారు.? వీళ్లను చంపడానికేనా.. లేదా మరేదైనా కారణముందా అని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నారు. కాగా.. ఇంట్లో నాటు బాంబు పేలుడు ఘటన స్థానికంగా కలకలకం రేపుతోంది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.