వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్పై డిటొనేటర్ దాడి, తప్పిన ప్రమాదం
పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది.
By Srikanth Gundamalla Published on 8 Oct 2023 4:45 PM IST
వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్పై డిటొనేటర్ దాడి, తప్పిన ప్రమాదం
పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే శంకర నారాయణ శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధిలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ క్రమంలో గ్రామం వద్దకు చేరుకున్నాక కారుదిగి నడుస్తూ ముందుకు కదిలారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కాన్వాయ్పై ఓ వ్యక్తి డెటొనేటర్ విసిరేశాడు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శంకర నారాయణ గడ్డం తండా పంచాయతీకి వెళ్లారు. గ్రామం వద్దకు వెళ్లాక కారు దిగి నడవడం ప్రారంభించారు. ఆయన అలా పది అడుగులు వేశారో లేదో.. ఓ వ్యక్తి డెటొనేటర్ ఎమ్మెల్యే కాన్వాయ్పైకి విసిరేశాడు. దాంతో.. ఆ డెటొనేటర్ కాన్వాయ్కి పక్కనే ఉన్న పొలాల్లో పడిపోయింది. అంతేకాదు.. అదృష్టవశాత్తు ఆ డెటొనేటర్ పేలలేదు. దాంతో పెనుప్రమాదం తప్పింది. కాగా.. ఆ డెటొనేటర్ ఎలక్ట్రికల్ది అని.. పవర్ సప్లై లేకపోవడం వల్ల పేలలేదని గుర్తించారు. డెటొనేటర్ విసిరిన ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చివరకు ఎవరికీ ఎలాంటి హాని జరక్కపోవడంతో పోలీసులతో పాటు.. కార్యకర్తలు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నాడు.
కాగా.. డెటొనేటర్ విసిరిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు సోమందేపల్లి మండలం గుడిపల్లికి చెందిన గణేష్గా గుర్తించారు. సదురు వ్యక్తి మద్యం మత్తులో డెటొనేటర్ విసిరినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్టన్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ఎమ్మెల్యే శంకర నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది తనపై హత్యాయత్నమే అని ఆరోపించారు. అంతేకాదు.. దీని వెనుక ఎవరున్నారో కూడా తెలియాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే శంకరనారాయణ ఆరోపించారు. అయితే.. తన అదృష్టం బాగుండి డెటొనేటర్ పేలలేని అన్నారు.