ప్రతి ఇంటికి వాలంటీర్ వచ్చి రూ.2,500 ఇస్తారు: సీఎం జగన్
ఏపీలో మిచౌంగ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 8 Dec 2023 2:21 PM IST
ప్రతి ఇంటికి వాలంటీర్ వచ్చి రూ.2,500 ఇస్తారు: సీఎం జగన్
ఏపీలో మిచౌంగ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలోనే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. తిరుపతి జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాలను జగన్ సందర్శించారు. అక్కడ నష్టపోయిన పలువురు రైతులతో జగన్ మాట్లాడారు. నష్టపోయిన రైతులను ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం జగన్ చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ ఆట్లాడుతూ.. ఏపీలో మిచౌంగ్ తుపాను కారణంగా నాలుగు ఐదు రోజులుగా భారీ వర్షాలు కురిశాయన్నారు. ఏపీలో ప్రజలకు వచ్చిన కష్టం.. కలిగిన నష్టం వర్ణనాతీతమే అన్నారు. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని సీఎం జగన్ ఆవేదన చెందారు. సాయం కోసం 92 రిలీఫ్ కేంద్రాలను పెట్టామని సీఎం జగన్ అన్నారు. 60వేల మంది బాధితులకు 25 కిలోల రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలను కూడా పంపిణీ చేశామన్నారు. అలాగే నష్టపరిహారం కింద రూ.2,500 ఇచ్చామనీ.. ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వబోమని సీఎం జగన్ అన్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ ఏపీలోనే ఉందన్నారు సీఎం జగన్. ప్రతి ఇంటికి వాలంటీర్ ద్వారా రూ.2500 అందిస్తామన్నారు. ఇంకా డబ్బులు అందని వారు గాబరా పడొద్దని చెప్పారు. పంట నష్టంపై ఓ ఒక్కరు బాధపడనవసరం లేదన్నారు. స్వర్ణముఖిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అలాగే తుపాను బాధితులందరికీ వారంలోఆ సాయం చేస్తామని చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. వర్షాలతో పాడైపోయిన రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతామని సీఎం జగన్ వెల్లడించారు.