Andhra Pradesh: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను విడుదల చేసింది.

By Srikanth Gundamalla
Published on : 13 April 2024 8:20 AM IST

andhra pradesh, appsc, group-1, prelims results,

 Andhra Pradesh: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల 

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను విడుదల చేసింది. ఏప్రిల్ 12వ తేదీన ఈ ఫలితాలను విడుదల చేశారు అధికారులు. మార్చి 27వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ పరీక్షను నిర్వహించిన కేవలం 27 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం రికార్డుగా మిగిలిందని ఏపీపీఎస్సీ అధికారులు చెబుతున్నారు. కాగా.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే.. పరీక్ష రాసిన వారిలో 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది.

గతేడాది డిసెంబర్ 8వ తేదీన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు అధికారులు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 81 గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 02, 09 తేదీల మధ్య మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయనీ ప్రెస్‌నోట్‌లో ఏపీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు. ఇక పోస్టు వివరాలు చూసినట్లు అయితే.. ఏపీ సివిల్‌ సర్వీస్ డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 9 ఉన్నాయి. ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్ పోస్టులు 18 ఉండగా.. సివిల్ డీఎస్పీ పోస్టులు 26, రీజనల్ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్ పోస్టులు 6 ఉన్నాయి.

కోఆపరేటివ్‌ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు 5, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు 4, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అధికారి పోస్టులు 3 ఉన్నాయి. అలాగే రెండు అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ పోస్టులు, జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌, జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.

Next Story