అనంతపురం: ఘోర రోడ్డు ప్రమాదం

By సుభాష్  Published on  15 Sep 2020 4:56 AM GMT
అనంతపురం: ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తుఫాన్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తుఫాన్‌ వాహనంలో ప్రయాణిస్తున్న పది మందిలో ముగ్గురు ఘటన స్థలంలోనే మృతి చెందగా, డ్రైవర్‌తో సహా ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.

కాగా, చిత్తూరు జిల్లాలోని తిరుచానూరులో ఓ ఆధ్యాత్మిక గురువు మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరంతా తాడిపత్రికి చెందిన వారుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story