నమస్తే ట్రంప్..పెద్దన్నకు ఘన స్వాగతం

By రాణి  Published on  24 Feb 2020 6:29 AM GMT
నమస్తే ట్రంప్..పెద్దన్నకు ఘన స్వాగతం

ముఖ్యాంశాలు

  • భారత సాంప్రదాయంలో ట్రంప్ కు సాదర స్వాగతం
  • అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో అమెరికా జెండాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియా ట్రంప్, కూతురు ఇవాంకా తో కలిసి భారత్ కు చేరుకున్నారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో గుజరాత్ లోని అహ్మాదాబాద్ ఎయిర్ పోర్ట్ కి ట్రంప్ చేరుకున్నారు. ట్రంప్ తో పాటు అమెరికాకు చెందిన ఇతర అధికారులు కూడా భారత్ కు వచ్చారు. ట్రంప్ కు సాదర స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో అమెరికా జెండాలు, నమస్తే ట్రంప్ పోస్టర్లు పెట్టారు. ట్రంప్ రాకతో అహ్మదాబాద్ లో పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు మొతెరా స్టేడియంలో ట్రంప్ కు ఘన స్వాగతం పలికేందుకు అన్ని వ్యాపార వర్గాల ప్రతినిధులు వేచి చూస్తున్నారు. భారత సాంప్రదాయం ప్రకారం ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్ కు స్వాగతం పలుకనున్నారు.

అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ట్రంప్ బీస్ట్ కారులో మొతెరా స్టేడియంకు చేరుకుంటారు. ఈ మధ్యలో ఉన్న సబర్మతి ఆశ్రమంలో 15 నిమిషాలు గడుపుతారు. అమెరికా ప్రెసిడెంట్ కు ఆహ్వానం పలుకుతూ లక్షా పది వేల సీటింగ్ కెపాసిటీతో ఆధునికీకరించిన మొతెరా స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి ఇరువురు నేతలు మధ్యాహ్నం 12.30 గంటలకు హాజరై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రంప్, మెలానియా ఆగ్రా బయల్దేరి సాయంత్రం 5 గంటలకు అక్కడికి చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోని ఐటీసీ మౌర్యా హోటల్ లో బస చేస్తారు.

25వ తేదీ, మంగళవారం ట్రంప్ దంపతులు రాష్ర్టపతి భవన్ ను సందర్శిస్తారు. ఉదయం 10.45 గంటలకు ట్రంప్, మెలానియా రాజ్ ఘాట్ కు చేరుకుని అక్కడ మోడీతో పాటు మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో ట్రంప్ తన సందేశాన్ని రాసి..హైదరాబాద్ హౌజ్ కు బయల్దేరుతారు. హైదరాబాద్ హౌజ్ లో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ మోడీ, ట్రంప్ ల మధ్య అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య వివిధ అంశాలకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఇరువురు సంతకాలు చేసి..మీడియా సమావేశం నిర్వహిస్తారు. మీడియా సమావేశం అనంతరం యూఎస్ ఎంబసీలో ఈసీఓ రౌండ్ టేబుల్ సమావేశముంటుంది.

అన్ని సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాని మోడీ ఇచ్చే లంచ్ లో ట్రంప్ దంపతులు పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్ ఐటీసీ మౌర్య హోటల్ చేరుకొని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలవనున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి రాష్ర్టపతి భవన్ లో రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే విందులో ట్రంప్ దంపతులు పాల్గొని..10 గంటలకు వారి ప్రత్యేక విమానంలో అమెరికాకు పయనమవుతారు.

Next Story