అక్కడ ట్యాప్ తిప్పితే నీళ్లకు బదులు మద్యం వస్తోంది.. ఏంటా అని చూస్తే..
By Newsmeter.Network Published on 5 Feb 2020 11:26 AM GMTఓ ఇంట్లో కుళాయిలో నీటికి బదులు మద్యం వస్తోంది. ఇలా కేవలం వారి ఇంట్లోనే వస్తోందా.. లేక అందరి ఇళ్లలో అలా వస్తుందని ఆరా తీయరా.. అందరి ఇళ్లలోనూ ఇలాగే రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇలా మొత్తం 18 కుటుంబాల కుళాయిల్లో రావడంతో అంతా అవాక్కైయ్యారు. ఇది ఎక్కడో విదేశాల్లో జరిగిన ఘటన అనుకుంటున్నారా.. కాదండి.. కేరళ రాష్ట్రంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
దీనిపై ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. త్రిశ్మూర్ జిల్లాలో ఈ అపార్టుమెంట్ సమీపంలో ఓ బార్ ఉండేది. అబ్కారీ శాఖ తనిఖీల్లో బార్ లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని గుర్తించారు. దాదాపు 6 వేల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. అనంతరం విచారణ చేపట్టిన కోర్టు.. మద్యాన్ని ధ్వంసం చేయాలని ఆదేశించింది.
మద్యాన్ని ధ్వంసం చేయాలని కోర్టు ఆదేశించడంతో ఇటీవలే అధికారులు బార్ పక్కనే ఓ గుంతను తవ్వి మద్యాన్ని అందులో పారబోశారు. అలా భూమిలోకి ఇంకిపోయిన మద్యం నేలపొరల్లోని నీటిలో కలిసిపోయింది.
అక్కడి స్థానికులు వాడే నీటి ట్యాంకులో ఈ మద్యం నీరు చేరింది. ఈ నీరే అపార్టుమెంట్ వాసులకు సరఫరా చేయడంతో అంతా ఆశ్చర్యపోవడంతో పాటు అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.