భారీ ప్యాకేజీ: వ్యవసాయ రంగానికి రూ. లక్ష కోట్లు: మంత్రి నిర్మలాసీతారామన్
By సుభాష్ Published on 15 May 2020 11:32 AM GMTకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మూడోసారి ఆర్థిక ప్యాకేజీపై వివరాలు వెల్లడించారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మూడో విడత వివరాలు ప్రకటించారు మంత్రి నిర్మలాసీతారామన్.
ముఖ్యంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, మత్స్య, వన సంపద, పశుసంపద, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం 11 అంశాలుండగా, అందులో 8 అంశాలు వ్యవసాయ రంగానికి , ఇతర రంగాలకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, రవాణా వంటివి ఉన్నాయి.
వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు, వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి, ధాన్యం కోతల తర్వాత ప్రాసెసింగ్ చేసుకోవడానికి, ఇక ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ. లక్షల కోట్లను ప్రకటించారు. ధాన్యాన్ని నిల్వచేసుకోవడానికి, కొనుగోలు చేసి ఎగుమతులు చేసేవారికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.
అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కోసం రూ. 10వేల కోట్లను ప్రకటించారు మంత్రి నిర్మలాసీతారామన్. అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద పథకాలను త్వరలోనే అమల్లోకి రానున్నట్లు చెప్పారు. ఫిషరిస్, ఆక్వా కల్చర్లో 55 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. మత్స్యకారులు చేపల వేట సమయంలో బోటుకు, బోటు యజమానులకు కూడా ఇన్స్ రెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వచ్చే ఐదేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుందని చెప్పారు.
అలాగే భారత్లో 53 కోట్ల పశు సంపద ఉందని, వాటికి ఎలాంటి రోగాలు రాకుండా వ్యాక్సినేషన్ చేయిస్తామని తెలిపారు. పశుగ్రాసం ఉత్పత్తికి రూ.15000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.