ఏసీపీని పొట్టనపెట్టుకున్న కరోనా వైరస్‌

By సుభాష్  Published on  18 April 2020 1:50 PM GMT
ఏసీపీని పొట్టనపెట్టుకున్న కరోనా వైరస్‌

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ గజగజ వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి చాలాకింద నీరులా అన్ని దేశాలకు పాకింది. తాజాగా భారత్‌లో కూడా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి ధాటికి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక తాజాగా ఈ కరోనా వైరస్‌ కారణంగా పంజాబ్‌లోని అసిస్టెంట్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) మరణించారు.

కరోనాను కట్టడి చేయడంలో అనునిత్యం నిద్రహారాలు లేకుండా పోలీసుల కృషి అంతా ఇంతా కాదు. ప్రజలు కరోనా బారిన పడకుండా పోలీసులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రింబవళ్లు ప్రజల కోసం పని చేస్తున్నారు. అలాంటి ఏసీపీని కరోనా మహమ్మారి పొట్టనపెట్టకుంది.

కరోనాపై జరుగుతున్న యుద్ధంలో పోలీసు అధికారి మృతి చెందడం విషాదంగా మారింది. పంజాబ్‌లోని లూధియానా అసిస్టెంట్‌ కమీషనర్‌గా అనిల్‌ కోహ్లీ (52) కరోనాతో ఎస్పీఎస్‌ అస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అక్కడి జిల్లా ప్రజా సంబంధాల కార్యాలయం వెల్లడించింది.

అనిల్‌ దాదాపు 30 సంవత్సరాలుగా పోలీసుశాఖలో సేవలందిస్తున్నారు. ఏసీపీ మృతి పట్ల పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ సంతాపం వ్యక్తం చేశారు. పోలీసుశాఖలో ఓ మంచి వ్యక్తిని కోల్పోయామని అన్నారు. అనిల్‌ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం అమరీందర్‌సిగ్‌ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.



Next Story