రూ.5 లక్షల విలువ చేసే మద్యం పట్టుకున్న పోలీసులు.. 8 మంది అరెస్ట్‌

By సుభాష్  Published on  28 April 2020 9:19 AM GMT
రూ.5 లక్షల విలువ చేసే మద్యం పట్టుకున్న పోలీసులు.. 8 మంది అరెస్ట్‌

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా మద్యం షాపులు మూసి ఉండటంతో మద్యం ప్రియులకు ఇబ్బందిగా మారిపోయింది. ఇక షాపులు మూతపడటంతో కొందరు కక్కుర్తిపడి బ్లాక్‌ మార్కెట్‌ను ఎంచుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా మద్యం షాపుల ద్వారా బ్లాక్‌లో మద్యం అమ్ముతూ ఎక్కువ సంపాదిస్తున్నారు. అధిక ధరలకు అమ్ముతూ గుట్టు చప్పుడు కాకుండా మద్యం అమ్మకాలు మొదలు పెడుతున్నారు.

ఇక తాజాగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో ఓ మద్యం షాపు నుంచి రూ.5 లక్షల విలువ చేసే మద్యాన్ని టాటా ఏసీ వాహనంలో నింపుతుండగా పోలీసులకు అడ్డంగా బుక్కైపోయారు. షాపు వెనుక భాగం కిటికీని తొలగించి మద్యం తరలిస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పట్టుకున్నారు. ఈ ఘటనలో 8 మందిని అరెస్ట్‌ చేసి, మద్యాన్ని సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story