పిల్లాడి శరీరంలో 11 సూదులు.. మిస్టరీనా.. కావాలనే చేశారా..?

By రాణి  Published on  4 March 2020 6:08 AM GMT
పిల్లాడి శరీరంలో 11 సూదులు.. మిస్టరీనా.. కావాలనే చేశారా..?

పిల్లలు ఏదైనా కనిపిస్తే చాలు నోట్లో పెట్టుకోవడమే.. మింగేయడమో చేస్తూ ఉంటారు. అందుకే తల్లిదండ్రులు వారి చేతుల్లో ఉన్న వస్తువులను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఓ మూడేళ్ళ కుర్రాడి శరీరంలోకి 11 సూదులు చేరడం మిస్టరీగా మారింది. ఇది ఆ పిల్లాడిని చంపడానికి చేసిన పనా అన్నది పోలీసులు కనుక్కునే పనిలో ఉన్నారు. మూడేళ్లు కూడా లేని ఆ కుర్రాడిని చంపడానికి కారణాలేమిటో కూడా పోలీసులు బయటకు లాగనున్నారు.

వీపనగండ్ల మండలానికి చెందిన అశోక్, అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారిలో మూడేళ్లు కూడా నిండని లోక్ నాథ్ శరీరంలో ఏకంగా 11 సూదులు ఎలాగో చేరాయి. సాధారణంగా చలాకీగా ఉండే లోక్ నాథ్ ఈ మధ్య కాలంలో సరిగా నడవలేకపోతున్నాడు. నొప్పిగా ఉందని ఏడుస్తూ ఉండేవాడు. ఇది అతడి తల్లిదండ్రుల్లో అనుమానానికి తావిచ్చింది. ఈ మధ్య ఆ పిల్లాడికి అన్నపూర్ణ స్నానం చేయిస్తూ ఉండగా అతడి శరీరంలో సూదులు ఉన్నట్లు గమనించింది. పిరుదుల భాగంలో ఉన్న సూదిని బయటకు తీసింది.

అన్నపూర్ణలో టెన్షన్ మొదలైంది. దీంతో భర్త అశోక్ ను తోడుగా తీసుకుని అన్నపూర్ణ వెంటనే వనపర్తిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ స్కానింగ్ నిర్వహించారు. ఆ రిపోర్టులో లోక్ నాథ్ శరీరంలో సూదులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 11 సూదులను గుర్తించారు. నడుము కిందభాగంలోనే దాదాపు ఈ సూదులు ఉన్నాయి. వెంటనే హైదరాబాద్ కు తీసుకుని వెళ్ళండి అని తల్లిదండ్రులకు సూచించారు. హైదరాబాద్ కు తీసుకుని వెళ్తే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని భయపడ్డారు అశోక్-అన్నపూర్ణ. దీంతో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి ఆ పిల్లాడిని తీసుకుని వెళ్లారు. ఆ పిల్లాడి శరీరంలో ఉన్న సూదుల్లో కొన్ని కిడ్నీకి అతి దగ్గరగా ఉన్నాయి. తొడలు, పిరుదులు, మల ద్వారంలో ఉన్న సూదులను డాక్టర్లు తొలగించేశారు. దాదాపు 5 గంటల పాటూ శ్రమించి 8 సూదులను బయటకు తీయగలిగారు.

వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సూచన ప్రకారం ఈ ఘటనపై పిల్లాడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఎదురింట్లో ఉన్నటువంటి గొల్ల అంజి, అలివేళమ్మ పేర్లను ఫిర్యాదులో చేర్చారు. తమ పిల్లాడిని ఆడించడానికి ఎప్పుడూ తీసుకుని వెళ్ళేది వాళ్లేనని.. పిల్లాడి శరీరంలో సూదులు ఉండటానికి కారణం వాళ్ళే అయి ఉంటారని అన్నపూర్ణమ్మ తెలిపింది. పోలీసు అధికారులు మాట్లాడుతూ వైద్యుల నుండి పూర్తీ రిపోర్టులు వచ్చాక పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తామని తెలిపారు. ఇప్పటికి ఎనిమిది సూదులను వైద్యులు తీసివేయగా కిడ్నీలకు అతి దగ్గరగా ఉన్న సూదులను తీసివేయడం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సవాల్ గా మారింది.. పిల్లాడి ప్రాణాలకు ఎటువంటి హాని కలగకూడదని ఈ విషయం తెలుసుకున్న వారు ప్రార్థిస్తూ ఉన్నారు.

అనుమానాలు ఎన్నో..!

ప్రస్తుతం ఈ కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇంజక్షన్ చివరిని తొలగించి సూదిని మరీ చిన్నపిల్లాడి శరీరంలోకి గుచ్చాల్సిన అవసరం ఎవరికి వచ్చింది. కిడ్నీలకు చాలా దగ్గరగా సూదులు చేరాయి అంటే ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అస్సలు కాదని తెలుసుకోవచ్చు. పిల్లాడు అన్ని రోజులుగా ఏడుస్తూ ఉన్నా తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొని రావడానికి ఎందుకు ఆలస్యం చేశారు. ప్రస్తుతం కేసును విచారిస్తున్న పోలీసులు నిజాలను బయటకు తీసుకురావడం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆ చిన్న పిల్లాడిని చంపడం ఎవరికి లాభం చేకూరుస్తుందన్నది..అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్న.

కాగా..ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ లు వేసుకోవక్కర్లేదంటున్నారు చెస్ట్ హాస్పిటల్ డాక్టర్ మహబూబ్ ఖాన్. దగ్గు, జలుబు, ముక్కులో మంట, ముక్కు కారడం, జ్వరం వంటి లక్షణాలున్నవారు, వారి పక్కనున్నవారు మాస్క్ ధరిస్తే చాలని తెలిపారు. ఈ లక్షణాలు లేని వారు మాస్క్ లను ధరించక్కర్లేదన్నారు. ఒక వేళ మాస్క్ లు లేకపోతే రుమాలు (హ్యాండ్ నాప్ కిన్), టిష్యూ పేపర్ లాంటి వాటిని అడ్డం పెట్టుకున్నా చాలని చెప్తున్నారు. రుమాలును వాడే వారు..ఎప్పటికప్పుడు దానిని శుభ్రం చేసుకుంటుండాలని సూచించారు. అలాగే కొత్తగా వచ్చే అపోహలను ప్రజలు నమ్మొద్దని పేర్కొన్నారు.

Next Story