ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల చేరువలో ఉన్న కరోనా కేసులు

By సుభాష్  Published on  7 Jun 2020 3:28 AM GMT
ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల చేరువలో ఉన్న కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. నెల రోజుల కింద ఉన్న కేసుల కంటే ప్రస్తుతం 30శాతం వరకు రెట్టింపు అయ్యాయి. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 122207 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 6962528కి చేరింది. ఇక శనివారం ఒక్క రోజే కొత్తగా 4,098 మంది మృతి చెందగా, ఇప్పటి వరకూ మరణాల సంఖ్య 4 లక్షల 15,44కు చేరింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతుండటంతో దేశాలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఊహించని విధంగా కరోనా కేసులు, మరణాలు సంభవించడం కరోనా పెద్ద సవాలుగా మారింది. ఇక వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి కనీసం ఇంకా ఆరు నెలల సమయం ఉంది. ఈలోగా ఇంకా ఎన్ని కేసులు వస్తాయోనని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇక అమెరికాలో మాత్రం కరోనా అంతకంతకు పెరిగిపోతోంది. తాజాగా కొత్తగా 21,975 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 19,87,683కు చేరింది. కొత్తగా 687 మంది మృతి చెందగా, ప్రస్తుతం మరణాల సంఖ్య 112077కు చేరింది.

కాగా, భారత్‌లో ఎక్కువగా పరీక్షలు చేస్తే అమెరికాకంటే భారత్‌లోనే కరోనా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.

అలాగే అమెరికా కంటే తాజాగా బ్రెజిల్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల అధికంగానే ఉన్నాయి. తాజాగా 25458 కరోనా కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 67,14,465కు చేరింది. శనివారం ఒక్క రోజు 875 మంది మృతి చెందారు. ఇక ఇప్పటి వరకూ మరణాల సంఖ్య 35,920కి చేరింది.

ప్రపంచ దేశాల్లో కరోనా ఎలా ఉన్నా.. ప్రస్తుతం భారత్‌లో కరోనా మనకు అతిపెద్ద సమస్యగా మారిపోయింది. ప్రపంచంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉండటం గమనార్హం. మొత్తం కేసుల వారీగా పరిశీలిస్తే భారత్‌ ఆరో స్థానంలో ఉంది.

రోజు వారీగా మరణాల్లో చూస్తే భారత్‌ నాలుగో స్థానం ఉండగా, మొత్తం మరణాల్లో 12వ స్థానంలో ఉంది. దీని బట్టిచూస్తే మన దేశంలో కరోనా తీవ్రత ఎంత ఉందో అర్థమైపోతోంది.

దేశాల వారీగా కరోనా కేసులు

♦ బ్రెజిల్లో 6,73,589 పాజిటివ్ కేసులు, 35,960 మంది మృతి

♦ రష్యాలో 4,58, 689 పాజిటివ్‌ కేసులు, 5,725 మంది మృతి

♦ స్పెయిన్‌లో 2,888,390 పాజిటివ్‌ కేసులు, 27,135 మంది మృతి

♦ యూకేలో 2,84,868 పాజిటివ్‌ కేసులు, 40,465 మంది మృతి

♦ ఇటలీలో 2,34,804 పాజిటివ్‌ కేసులు, 33,846 మంది మృతి

♦ జర్మనీలో 1,85,696 పాజిటివ్‌ కేసులు, 8,769 మంది మృతి

♦ ఫ్రాన్స్‌ లో 1,53,634 పాజిటివ్‌ కేసులు , 29,142 మంది మృతి

ఇక భారత్‌లో తాజాగా 9887 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒకే రోజు ఇన్ని కేసులు రావడం మొదటి సారి. గడిచిన 24 గంటల్లో 294 మంది మృతి చెందారు. ప్రస్తుతం కరోనా కేసులు భారత్‌లో 236657 ఉన్నాయి. తాజాగా 4611 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 114072 ఉంది. దేశంలో కరోనా సోకిన వారిలో 48.2 శాతం రివకరీ అవుతుండటంత మంచి విషయమే అయినా.. కరోనా బారిన పడ్డ ప్రతి 1000 మందిలో 28 మంది మృత్యువాత పడుతున్నారు. ఈ విషయం ఆందోళన కలిగించే అంశమేనని చెప్పకతప్పదు.

ఇక మహారాష్ట్రలో 80229, తమిళనాడులో 28694, ఢిల్లీలో 26334,గుజరాత్‌లో 19094 కేసులతో నమోదవుతున్న అత్యధిక రాష్ట్రాలుగా ఉన్నాయి.

ఇక తెలంగాణలో..

ఇక తెలంగాణలో కూడా రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 206 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఒక్క రోజు 10 మంది మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 152 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసులు 3496కి చేరుకోగా, వీరిలో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులున్నారు.

ఇక కరోనాతో 1710 మంది డిశ్చార్జ్‌ కాగా, ప్రస్తుతం 1663 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా బారిన 123 మంది మృతి చెందారు.

మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య -3496

♦ కొత్తగా పాజిటివ్‌ కేసులు – 206

♦ ఈ రోజు జీహెచ్‌ఎంసీలో కరోనా కేసులు – 152

♦ ఒక్క రోజే కరోనా మరణాలు – 10

♦ ఇప్పటి వరకూ కరోనా మరణాలు – 123

♦ యాక్టీవ్‌ కేసుల సంఖ్య – 1663

♦ ఇప్పటి వరకూ డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య – 1710

కొత్తగా ఎక్కడ ఎన్ని కేసులు..

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ 152, రంగారెడ్డి 10, మేడ్చల్‌ 18, నిర్మల్‌ 5, యాదాద్రి 5, మహబూబ్‌నగర్‌ 4, మహబూబాబాద్‌ 1, జగిత్యాల్‌ 2, వికారాబాద్‌ 1, నాగల్‌ కర్నూల్‌ 2, గద్వాల్‌ 1, నల్గొండ 1, భద్రాది 1, కరీంనగర్ 1, మంచిర్యాల 1, జనగాం 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఏపీలో..

ఇక ఏపీలో చూస్తే కేసుల సంఖ్య బాగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 12,771 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 161 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఏపీలో మొత్తం కేసులు 3588 ఉండగా, వాటిలో 2323 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించకపోగా, ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 73కు చేరింది. ప్రస్తుతం 1192 కేసులు యాక్టీవ్ గా న్నాయి. తాజాగా 29 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో 131 మందికి కరోనా సోకగా, వారిలో127 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కరోనా కేసుల సంఖ్య 741 ఉండగా, వారిలో 467 మంది యాక్టీవ్‌గా ఉన్నట్లు ఏపీ ఆరోగ్యశాఖ తెలిపింది.

♦ మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య -3588

♦ కొత్తగా పాజిటివ్‌ కేసులు – 161

♦ ఇప్పటి వరకూ కరోనా మరణాలు – 73

♦ యాక్టీవ్‌ కేసుల సంఖ్య – 1192

♦ ఇప్పటి వరకూ డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య – 2323

Next Story