ఆర్ధికమాంద్యం ఉందని ఎవరన్నారు..?!.

By Newsmeter.Network  Published on  9 Oct 2019 12:31 PM GMT
ఆర్ధికమాంద్యం ఉందని ఎవరన్నారు..?!.

దేశాన్ని ఆర్ధికమాంద్యం చుట్టేస్తుంది. మోదీకి ఆర్ధిక వ్యవస్థపై పట్టులేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గర మోదీ సలహాలు తీసుకోవాలి. ఇవి కొన్ని రోజులుగా న్యూస్‌ పేపర్ల మన చదువుతున్న హెడ్ లైన్స్. మనం వింటున్న వార్తలు. . అంతేనా..కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కామెంట్ కూడా చేసింది. "నేటి యువత సొంత కార్ల కంటే క్యాబ్‌లే బెస్ట్ అనుకుంటున్నారు. ఈఎంఐలు కట్టలేక యువత టూ , ఫోర్ వీలర్స్ వాహనాలు కొనడం లేదు" . ఇది ఎంత వివాదమైందో, సోషల్ మీడియాలో నెటిజన్లు కేంద్ర మంత్రిని ఎలా ఆడుకున్నారో కూడా చూశాం.

అసలు ఆర్ధికమాంద్యం ఉందా?! లక్షలాది ఉద్యోగాలు ఊడిపోతున్నాయా?!

ఆర్థిక మాంద్యం అనే పదాన్ని రాజకీయ అవసరాల కోసమే ప్రత్యర్ధి పార్టీలు సృష్టించాయా?. నిజానికి ఆర్ధిక మాంద్యం లేదా?. ఉద్యోగాలు, దేశ ఆర్ధిక వ్యవస్థ బాగానే ఉన్నాయా?. దేశ ప్రజల జేబుల్లో కరెన్సీ నోట్లు మూలుగుతున్నాయా?.

శ్రీ తాడిబందు వీరాంజనేయ స్వామి గుడికి వెళ్తే ఆర్ధిక మాంద్యం ఛాయలే కనిపించడం లేదు. తాడిబందు వీరాంజనేయప్వామి గుడికి పూజల కోసం వచ్చిన వాహనాలను చూస్తే..ఆర్ధిక వ్యవస్థ బేషుగ్గానే ఉందనిపిస్తుంది. అంతేకాదు..పట్టణవాసుల దగ్గరే కాకుండా..పల్లె ప్రజల దగ్గర కూడా డబ్బులు బాగానే ఉన్నాయనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం నుంచి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఆటో మొబైల్ రంగానికి ప్రాణం పోస్తున్నాయనడానికి ఇక్కడకు పూజకు వచ్చిన వాహనాలే ఉదాహరణ.

పూజకు వేలాది వాహనాలు

చూడండి..ఒక్కటీ కాదు..రెండు కాదు వందలాది వాహనాలు. టూ వీలర్సే కాదు..ఫోర్ వీలర్స్ కూడా ఉన్నాయి. జనాల జేబుల్లో , బ్యాంకుల్లో డబ్బుల్లేకపోతే ఈ వాహనాలు పూజలకు వచ్చేవా?. సో...ప్రజల దగ్గర డబ్బులున్నాయి. ఆటో మొబైల్ రంగం పరుగులు పెడుతుంది అని చెప్పడానికి ఉదాహరణ పూజకు వచ్చిన ఈ వాహనాలు.

ఈ రోజే కాదు గత రెండ్రోజుల నుంచి గుడికి వాహనాల తాకిడి ఎక్కువుగానే ఉందని చెబుతున్నారు. ఒక పక్క వర్షాలు బాగా పండుతుండటం రైతులతోపాటు అన్ని వర్గాల్లో ఒక రకమైన ధైర్యం వచ్చిందనే చెప్పాలి. ఆ ధైర్యమే ఆటో మొబైల్ రంగానికి ఊపునిస్తుంది అనుకోవాలి. రానున్న రోజుల్లో డబ్బులకు ఇబ్బంది ఉండదనుకునేవారు..లోన్‌లు , ఈఎంఐలతో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ కొంటున్నారు.

ఒక్క శ్రీతాడిబందు వీరాంజినేయ స్వామి గుడిలోనే ఇన్ని వాహనాలు పూజలు చేయించుకుంటే..తెలంగాణ రాష్ట్రమంతా ఎన్నివాహనాలు కొత్తగా రోడ్ల మీదకు వచ్చి ఉంటాయో అంచనా వేసుకోవచ్చు.

ఒక్కో వాహనానికి ఒక్కో రేటు

ఇక..తాడిబందు వీరాంజనేయ స్వామి ఆలయంలో ఒక్కో వాహనానికి పూజ చేయడానికి ఒక్కో రేటు ఉంటుంది.

1. లారీ/ బస్సు పూజ : రూ.500

2. కారు పూజ : రూ. 150

3.ఆటో (త్రీ వీలర్‌) పూజ: రూ.100

4.స్కూటర్ (టూ వీలర్) పూజ: రూ.75

5.సైకిల్ పూజ:రూ.5

Next Story