ఫ‌స్ట్ సింగిల్ తోనే మైండ్‌ బ్లాక్ చేసిన సూప‌ర్ స్టార్

By Newsmeter.Network  Published on  3 Dec 2019 6:37 AM GMT
ఫ‌స్ట్ సింగిల్ తోనే మైండ్‌ బ్లాక్ చేసిన సూప‌ర్ స్టార్

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్‌ వ్యూస్‌ పరంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలోని పాటలను సరికొత్తగా ప్రతి సోమవారం ఒక పాట చొప్పున ఐదు పాటలను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించింది.

అందులో భాగంగా మొదటి సోమవారం అయిన డిసెంబర్‌ 2న సినిమాలోని మాస్‌ నంబర్‌ ‘మైండ్‌ బ్లాక్‌’ను విడుదల చేశారు. ‘మైండ్‌ బ్లాక్‌… మైండ్‌ బ్లాక్‌… మైండ్‌ బ్లాక్‌.. బాబూ.. నీ మాస్‌ లుక్కు మైండ్‌ బ్లాకు’ అంటూ సాగే పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా దేవిశ్రీప్రసాద్‌ హుషారైన బీట్‌తో ట్యూన్‌ చేశారు. బ్లేజ్‌, రెనినా రెడ్డి గానం చేసిన ఈ పాటలో మహేష్‌ వాయిస్‌ ఓ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా చెప్పవచ్చు. ‘బాబూ నువ్‌ సెప్పు.. వాడ్ని కొట్టమని డప్పు’ అని లేడీ సింగర్‌ అనగా…‘నువ్‌ కొట్టరా..’ అని మహేష్‌ చెప్పడం కొత్తగా ఉంది.

పాట మధ్యలో కూడా రెండుసార్లు ఇలా మహేష్‌ వాయిస్‌ వినిపిస్తుంది. ఇలాంటి మాస్‌ నంబర్స్‌ చేయడంలో సిద్ధహస్తుడైన దేవిశ్రీప్రసాద్‌ మరోసారి ఈ పాటతో తన మార్క్‌ని చూపించారు. ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ బెస్ట్‌ ఇంప్రెషన్‌ అన్నట్టుగా ఐదు పాటలున ఈ ఆల్బమ్‌లోని మొదటి పాట ప్రతి ఒక్కరితోనూ డాన్స్‌ చేయించేలా ఉంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Next Story