ట్రంప్‌ ఎఫెక్ట్‌: టిక్‌టాక్‌ సీఈవో రాజీనామా

By సుభాష్  Published on  27 Aug 2020 7:18 AM GMT
ట్రంప్‌ ఎఫెక్ట్‌: టిక్‌టాక్‌ సీఈవో రాజీనామా

చైనాకు చెందిన టిక్‌టాక్‌తో పాటు పలు యాప్‌లను భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో టిక్‌టాక్‌పై వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోతుండటంతో టిక్‌టాక్‌ సీఈవో కెవిన్‌ మాయర్‌ రాజీనామా చేశారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొ నాల్డ్‌ ట్రంప్‌ నుంచి టిక్‌టాక్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆయన ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'ఇటీవల కాలంలో రాజకీయ వాతావరణం వేగంగా పెరిగింది. ప్రపంచ స్థాయిలో వ్యాపారానికి అవసరమైన మార్పులను కార్పొరేట్‌ వ్యవస్థలో చేశాను. నేను తప్పుకోవాలని అనుకున్నాను' అని ఉద్యోగులకు పంపిన లేఖలో కెవిన్‌ పేర్కొన్నట్లు ఆంగ్ల పత్రిక సీఎన్‌ఎన్‌ పేర్కొంది.

'ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతకు త్వరలోనే ఓ పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాను. నేను మీ అందరినీ విడిచి వెళ్లపోవడం బాధాకరంగానే ఉంది' అని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కెవిన్‌ రాజీనామాను గౌరవిస్తున్నట్లు టిక్‌టాక్‌ ప్రతినిధి వెల్లడించారు.

గతంలో డిస్నీలో పని చేశారు. నాలుగు నెలల కిందట టిక్‌టాక్‌ ఆయనను సీఈవోగా నియమించింది. అమెరికా రెగ్యులేటరీలకు అనుగుణంగా యాప్‌లో మార్పులు చేసి ప్రజలకు మరింత తీసుకెళ్తారని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌పై ట్రంప్‌ సర్కార్‌ తన ప్రతాపం పెంచింది. మరో పక్క బ్యాన్‌ను తప్పించుకోవాలంటే అమెరికాలో వ్యాపారాన్ని విక్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది.

Next Story