Fact Check: ఆకలి తీర్చేందుకు ఆహారం ఇస్తే.. ప్లాట్ఫామ్పైకి విసిరిన వలస కూలీలు... ఇది నిజమేనా ?
By సుభాష్ Published on 9 May 2020 8:58 AM GMTసోషల్ మీడియాలో ఓ వీడియో తెగ తిరుగుతోంది. ప్లాట్ఫామ్ పైకి ప్రయాణీకులు ఆహార ప్యాకెట్లు విసిరేస్తున్నారు. అధికారులను, పోలీసులను దూషిస్తున్నారు. ప్లాట్ఫామ్పైన ఉన్న భద్రతా సిబ్బంది పల్లెత్తు మాట కూడా అనడం లేదు. మరి.. ప్రయాణీకులకు ఆగ్రహం ఎందుకు వచ్చింది ? అసలు వీళ్లు ఎందుకిలా చేస్తున్నారు ?
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభుత్వం, రైల్వే వలస కూలీల కోసం ప్రత్యేకంగా భోజనం ప్యాకెట్లు, తాగునీళ్లు అందిస్తే వాళ్లు మాత్రం ఇలా నిరసన తెలియజేస్తూ ఉద్దేశ్యపూర్వకంగానే ఆహారాన్ని నేలపాలు చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు పలు రైటప్లు జోడిస్తూ వలస కూలీల ప్రవర్తనను ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వంవీళ్లకోసం ఇంతగా ఏర్పాట్లు చేస్తుంటే.. వలస కూలీలది ఇదేం సంస్కృతి అంటూ శాపనార్ధాలు కూడా పెడుతున్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో రవాణా సదుపాయాలు పూర్తిగా స్తంభించాయి. రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఎక్కడివాళ్లు అక్కడ ఆగిపోయారు. అయితే.. వలస కూలీల కష్టాలు గమనించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లను సొంత రాష్ట్రాలకు పంపించేందుకు ప్రత్యేక రైళ్లను సమకూర్చింది. అందులో భాగంగానే కేరళనుంచి ధానాపూర్ వెళ్లేందుకు ప్రత్యేకంగా శ్రామిక్ ఎక్స్ప్రెస్ను ఏర్పాటు చేశారు. కేరళలో ఉన్న వలస కూలీలను ఈ ట్రైన్లో సొంత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే.. ఆసన్సోల్ రైల్వేస్టేషన్ వచ్చేసరికి ఆ వలస కూలీలంతా ఇలా.. ప్లాట్ఫామ్పై భోజనం ప్యాకెట్లను విసిరేసి నిరసన తెలిపారు.
ఈ వీడియో నిజమా కాదా అని పరిశీలిస్తే నిజమే. కానీ, జరుగుతున్న ప్రచారంలో మాత్రం వాస్తవం లేదు. వలస కూలీలు కోపంతో ఇలా ఆహారాన్ని నేలపాలు చేయడం లేదు. శ్రామిక్ ఎక్స్ప్రెస్లో వలస కూలీలు దానా పూర్ వెళ్తుండటంతో.. ఆసన్సోల్ స్టేషన్లో వాళ్లందరికీ ఆహారం, నీళ్లు అందించేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే.. రైలు రావడం ఆలస్యమైందో, లేదంటే వంటల్లో లోపమో కానీ.. ఆ ఆహారాన్ని వలస కూలీలకు అందించేసరికి ఆలస్యమైంది. దుర్గంధం వెదజల్లుతోంది. కనీసం వాసన కూడా చూడలేకుండా దుర్వాసన వస్తోంది. దీంతో.. వలస కూలీలు ఆగ్రహానికి గురయ్యారు. తమకు భోజనం అందించామని చెప్పుకోవడానికే అధికారులు ఇలా చేశారని, చెడిపోయిన ఆహారాన్ని తమ ముఖాన కొట్టారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా.. ప్లాట్ఫామ్పైకే ఆ భోజన ప్యాకెట్లను విసిరేశారు. అధికారుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియోల పట్ల రైల్వే అధికారులు స్పందించారు. ఆహార ఏర్పాటును ఐఆర్సిటిసి చేసిందని, కొన్ని బోగీల్లో అందించిన ఆహారం దుర్వాసన వచ్చిందని ప్రయాణీకుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తూర్పు రైల్వే పీఆర్వో ఏకలబ్యా చక్రవర్తి తెలిపారు. అయితే.. అదే స్టేషన్లో ఈ సమస్యను సరిదిద్దలేకపోయామని, తదుపరి స్టేషన్లో వలస కూలీలందరికీ తాజా భోజన ఏర్పాట్లు చేశామని చక్రవర్తి వెల్లడించారు.
[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/WhatsApp-Video-2020-05-09-at-2.03.06-PM.mp4"][/video]
ప్రచారం : అధికారులు భోజన సదుపాయం కల్పిస్తే వలస కూలీలు ప్లాట్ఫామ్పై పడేశారు.
వాస్తవం : భోజనం దుర్వాసన వస్తుండటంతోనే వలస కూలీలు ఇలా ప్లాట్ఫామ్పైకి భోజన ప్యాకెట్లు విసిరేసి నిరసన తెలిపారు.
కంక్లూజన్ : వీడియో వాస్తవమే కానీ మిస్ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- సుజాత గోపగోని