బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో తొలి 'కరోనా' కేసు
By సుభాష్ Published on 2 March 2020 9:34 AM GMTచైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ 19 (కరోనా వైరస్) తెలంగాణకు పాకింది. కాగా, భారత్లో రెండు కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఢిల్లీలో మరో వ్యక్తికి కూడా ఈ వైరస్ ఉన్నట్లు పేర్కొంది. కాగా, కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఇటలీ దేశం నుంచి వచ్చినట్లు తెలిపింది. కరోనా సోకిన ఇద్దరు వ్యక్తులను ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా ఇప్పటి వరకు 66 దేశాలకు చాపకింద నీరులా విస్తరించింది. మొత్తం ఈ వైరస్ సోకి 3వేలకు పైగా మృతి చెందగా, మరో 88,257 మందికి ఈ వైరస్ సోకింది. మృతుల్లో 2,870 మంది చైనాకు చెందిన వారే కావడం గమనార్హం. కాగా ఒక్క రోజు వ్యవధిలోనే 2,338 మందికి ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా చైనా, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్, జపాన్లలో కనిపిస్తోంది.