నాకు మెసేజ్ చేసి మరీ బాధను వ్యక్తం చేసిన సుశాంత్.. ఆమె అంతగా వేధించేదా..?

By సుభాష్  Published on  31 July 2020 1:49 AM GMT
నాకు మెసేజ్ చేసి మరీ బాధను వ్యక్తం చేసిన సుశాంత్.. ఆమె అంతగా వేధించేదా..?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సుశాంత్ ది ఆత్మహత్య కాదని.. మర్డర్ అన్న అనుమానాలు తనకు ఉన్నాయని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఇంతలో సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండేను బీహార్ పోలీసులు విచారించారు. రియా తనను వేధించేదని సుశాంత్‌ తనతో చెప్పాడని అంకితా పోలీసులకు చెప్పినట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది. 2019లో తాను నటించిన మణికర్ణిక సినిమా సమయంలో సుశాంత్‌తో ఒకసారి చాట్ చేయగా.. ఆ సమయంలో రియాతో తన బంధాన్ని తెంచుకోవాలని సుశాంత్‌ తనతో అన్నాడని ఆమె పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

మ‌ణిక‌ర్ణిక సినిమా విడుదల స‌మ‌యంలో సుశాంత్ సింగ్ తనకు మెసేజ్ చేసి అభినందించాడని, రియా త‌న‌ని వేధిస్తోందని అప్పుడు చెప్పాడని ఆమె తెలపడమే కాకుండా.. రియాతో తాను తెగదెంపులు చేసుకోవాలని భావిస్తున్నాన‌ని సుశాంత్ చెప్పాడని అంకిత తెలిపినట్లు ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థలు తెలిపాయి.

సుశాంత్ మరణానికి అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమంటూ సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో రియా చక్రవర్తిపై కేసును సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. కేకే సింగ్ ఫిర్యాదు మేరకు సుశాంత్ సూసైడ్‌కు సహకరించిందని, అలాగే చీటింగ్, కుట్ర ఆరోపణలపై పోలీసులు రియా చక్రవర్తిపై కేసును నమోదు చేశారు. దీంతో బీహార్ పోలీసులు ముంబైలో రియాను విచారించాలని భావించారు.

ముంబై బాంద్రా కొటాక్ మ‌హేంద్ర బ్యాంక్ కు చెందిన సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్లు మూడు అకౌంట్ల‌కు ట్రాన్స్ ఫ‌ర్ అయ్యాయ‌ని ఆరోపించారు. ఆ బ్యాంక్ అకౌంట్లు రీయా చ‌క్ర‌వ‌ర్తి ఆమె త‌ల్లి, సోద‌రుడివేన‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీహార్ పోలీసులు బాంద్రా కొటాక్ బ్యాంక్ లోని సుశాంత్ అకౌంట్ ట్రాన్సాక్ష‌న్ల‌పై ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈడీ అధికారులు సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో న‌మోదైన ఎఫ్ ఆర్ , సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల గురించి వివరాల్ని సేక‌రిస్తున్నారు. సుశాంత్ 15 కోట్ల డబ్బులు మనీ లాండరింగ్ ద్వారా చేతులు మారాయా అన్నదానిపై కూడా విచారణ మొదలుపెట్టారు.

Next Story