వివేకా హత్య - సొంతవాళ్లకు ఎలా తెలిసింది?

By రాణి  Published on  29 Jan 2020 6:59 AM GMT
వివేకా హత్య - సొంతవాళ్లకు ఎలా తెలిసింది?

ముఖ్యాంశాలు

  • మార్చ్14, 2019 అర్థరాత్రి వివేకా దారుణహత్య
  • మార్చ్15న ఉదయం 7 గంటలకు బ్రేకింగ్ న్యూస్
  • టీవీలో బ్రేకింగ్ చూసి విషయం తెలుసుకున్న డా.సునీత
  • ఆగమేఘాలమీద పులివెందులకు వచ్చిన కుటుంబం
  • మధ్యాహ్నం 12.30 గం.లకు పులివెందుల చేరిన కుటుంబం
  • అప్పటికే వివేకా మృతదేహానికి పూర్తైన పోస్ట్ మార్టమ్
  • మొదట కార్డియాక్ అరెస్ట్ అని ప్రచారం
  • తర్వాత కేసులో సెక్షన్లు మార్చిన పోలీసులు

“మార్చ్ 15వ తేదీ 2019న రాష్ట్ర ప్రజానీకం నిద్రలేచేసరికి ఉదయం 7 గం.లకు ప్రముఖ ఛానెల్ లో డాక్టర్ వై.ఎస్.వివేకానందరెడ్డి కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారన్న వార్త ప్రసారమయ్యింది. కొద్ది సేపటి తర్వాత నేను ఒక ఛానెల్ లో చూసే ఆ విషయాన్ని తెలుసుకున్నాను. సరిగ్గా అదే రోజున అంటే మార్చ్ 15, 2019న ఎమ్.కృష్ణారెడ్డి మా అమ్మకు ఉదయం 5.30 గం.లకు కాల్ చేసి మా నాన్న ఇంకా నిద్రపోతున్నారనీ, మెయిన్ డోర్ మూసి ఉందనీ, ఎంత కొట్టినా తెరవడం లేదనీ, ఇంకా నిద్రపోతున్నట్టుగా ఉన్నారనీ చెప్పాడు.

ముందురోజు మా నాన్న చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చుంటారనీ, ఇంకొంచెం సేపు అలాగే నిద్రపోనివ్వమని చెప్పింది. ఉదయం 6.15 గం.లకు ఎం.వి.కృష్ణారెడ్డి నా భర్త రాజశేఖర్ రెడ్డి నర్రెడ్డికి ఫోన్ చేసి డాక్టర్ వై.ఎస్.వివేకానందరెడ్డి బాత్రూమ్ లో రక్తం మడుగులో పడి ఉన్నారని సమాచారం ఇచ్చాడు. నా భర్త వెంటనే ఈ విషయాన్ని నాకూ చెప్పారు. తర్వాత వెంటనే వై.ఎస్.వివేకానందరెడ్డి అల్లుడైన రాజశేఖర్ రెడ్డి నర్రెడ్డి, డ్రైవర్ ప్రసాద్ కి ఫోన్ చేసి తనెక్కడున్నాడో అని వివరాలు కనుక్కునే ప్రయత్నం చేశాడు. అప్పుడు డ్రైవర్ ప్రసాద్ తను తన ఇంట్లోనే నిద్రపోతున్నాననీ, కిందటిరోజు రాత్రి బాగా ఆలస్యం అయినందున ఇంకా నిద్రపోతున్నాననీ సమాధానం ఇచ్చాడు. కిందటి రోజున చాలా ఆలస్యం అయిన కారణంగా మర్నాడు ఆలస్యంగా రావడానికి వై.ఎస్.వివేకానందరెడ్డిని అనుమతి కోరాననికూడా చెప్పాడు.

అప్పుడు వెంటనే రాజశేఖర్ రెడ్డి నర్రెడ్డి డ్రైవర్ ప్రసాద్ ని వెంటనే డాక్టర్.వై.ఎస్.వివేకానందరెడ్డి ఇంటికి హుటాహుటిన వెళ్లమని చెప్పారు. ఉదయం 6.19 గం.ల సమయంలో డ్రైవర్ ప్రసాద్ పందింటి రాజశేఖర్ కి ఫోన్ చేసి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు కారణం ఏమై ఉంటుందోనని విచారించాడు. అప్పుడు పందింటి రాజశేఖర్ తనసలు పులివెందులలోనే లేనని చెప్పాడు. తను మార్చ్ 14వ తేదీన కాణిపాకం వెళ్లాననీ, ప్రసాద్ ఫోన్ చేసిన సమయంలో పులివెందులకు తిరిగి వస్తున్నాననీ చెప్పాడు. ఉదయం 6.23 గం.లకు రాజశేఖర్ రెడ్డి నర్రెడ్డి ఇనయతుల్లాకి ఫోన్ చేసి అతనెక్కడున్నాడో అని కనుక్కున్నారు. అప్పుడు ఇనయతుల్లా ఉదయంపూట నమాజుని అప్పుడే పూర్తి చేసుకున్నాననీ, వై.ఎస్.వివేకానందరెడ్డి ఇంటికి బయలుదేరడానికి సన్నద్ధమవుతున్నాననీ చెప్పాడు. అప్పటికే ఇనయతుల్లాకు రాజశేఖర్ రెడ్డి నర్రెడ్డి తమ్ముడు శివప్రకాష్ రెడ్డి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సమాచారం ఇచ్చారు.

వైఎస్ అవినాష్, ఇనయతుల్లా ఆ విషయాన్ని గుర్తించారు

ఉదయం 6.26 గంటలకు రాజశేఖర్ నర్రెడ్డి తమ్ముడు శివప్రకాష్ రెడ్డి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ప్రస్తుతం కడప పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వై.ఎస్.అవినాష్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఉదయం 6.30 గంటలకు వై.ఎస్.అవినాష్ రెడ్డి వై.ఎస్.వివేకానందరెడ్డి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే వై.ఎస్.వివేకానందరెడ్డి ఇంటికి వచ్చిన ఇనయతుల్లా రక్తపు మడుగులో పడిఉన్న వై.ఎస్.వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఫోటోలు తీస్తున్నాడు. దాదాపుగా ఎనిమిది అడుగుల దూరంవరకూ బాత్రూమ్ నుంచి బెడ్ రూమ్ వరకూ రక్తపు మడుగు, మరకలు ఉన్న విషయాన్ని ఇనయతుల్లా, వై.ఎస్.అవినాష్ రెడ్డి గుర్తించారు.

తర్వాత కొద్ది సేపట్లోనే అంటే దాదాపుగా ఉదయం 6.25 గంటల సమయంలో 1. వై.ఎస్.ప్రకాష్ రెడ్డి, 2. వై.ఎస్.మనోహర్ రెడ్డి, 3.వై.ఎస్.ప్రతాప్ రెడ్డి, 4.డా.వై.ఎస్.అభిషేక్ రెడ్డి, 5.డి.శివశంకర్ రెడ్డి, 6.ఉదయ్ కుమార్ రెడ్డి, 7.డా.నాయక్, 8.ప్రకాష్ రెడ్డి - కాంపౌండర్ 9, డా.మదుసూదన్ రెడ్డి, 10. నర్రెడ్డి జగదీశ్వర్ రెడ్డి, 11. ఎర్రా గంగిరెడ్డి, 12. వై.ఎస్.జోసఫ్ రెడ్డి, 13. రామకృష్ణారెడ్డి - క్యాషియర్, దినేష్ నర్సింగ్ హోమ్, 14, వై.ఎస్.మదుసూదన్ రెడ్డి, 15. శంకరయ్య - సర్కిల్ ఇన్ స్పెక్టర్, 16. రామకృష్ణారెడ్డి - హెడ్ కానిస్టేబుల్, 17.శ్రీనివాసరెడ్డి - క్యాషియర్, దినేష్ నర్సింగ్ హోమ్ ఘటనా స్థలానికి అంటే వై.ఎస్.వివేకానందరెడ్డి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఎమ్.వి.కృష్ణారెడ్డి, ఇనయతుల్లా, రంగయ్య, ప్రకాష్, లక్ష్మమ్మ, డా.వై.ఎస్.అవినాష్ రెడ్డి అక్కడున్నారు. వై.ఎస్.అవినాష్ రెడ్డి, ఇ.సి.సురేంద్రనాథ్ రెడ్డి, డి.శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ఉదయం 6.33 గంటలకల్లా సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్నారు. మాకు ఉన్న సమాచారం ప్రకారం ఎం.వి.కృష్ణారెడ్డి సీన్ ఆఫెన్స్ ని బట్టి ఖచ్చితంగా వై.ఎస్.వివేకానందరెడ్డిని ఎవరో హత్య చేసుంటారని, కేసు రిజిస్టర్ చేయాలని సర్కిల్ ఇన్ స్పెక్టర్ శంకరయ్యను కోరాడు.

షేక్ ఇనయతుల్లా, నర్రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా అది దారుణమైన హత్యేనని, వెంటనే కేస్ బుక్ చేయాలని సర్కిల్ ఇన్ స్పెక్టర్ పై ఒత్తిడి చేశారు. తర్వాత ఎం.వి.కృష్ణారెడ్డి రాజశేఖర్ రెడ్డి నర్రెడ్డికి ఫోన్ చేసి, గంగిరెడ్డి సర్కిల్ ఇన్ స్పెక్టర్ శంకరయ్యకు ఫోన్ ఇచ్చేశాడనీ, కేస్ బుక్ చేయొద్దని కోరాడనీ తెలిపాడు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి నర్రెడ్డి సి.ఐ శంకరయ్యను కేసు రిజిస్టర్ చేయమని కోరారు. ఈ లోగా మేమందరం హైదరాబాద్ నుంచి కారులో పులివెందులకు బయలుదేరాం.” అంటూ వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున పరిణామాలకు సంబంధించిన వివరాలను ఆయన కూతురు డాక్టర్ సునీత తాను హైకోర్ట్ లో దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు.

Next Story