సుమలత అంబరీష్ కు కరోనా పాజిటివ్

By సుభాష్  Published on  7 July 2020 3:21 AM GMT
సుమలత అంబరీష్ కు కరోనా పాజిటివ్

యాక్టర్ నుండి పొలిటీషియన్ గా మారిన సుమలత అంబరీష్ సోమవారం నాడు తనకు కరోనా సోకిందని ప్రకటించారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కరోనా టెస్టులు చేయించుకున్నానని..ఆ అందులో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. 'ఈ రోజు నాకు రిజల్ట్స్ తెలిశాయి.. పాజిటివ్ అంటూ వచ్చింది' అని ఆమె తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. వైద్యుల సలహా మేరకు తాను హోమ్ క్వారెంటైన్ లో ఉన్నానని తెలిపారు.

లోక్ సభ మెంబర్ అయిన సుమలత ఇటీవలి కాలంలో తాను ఎవరెవరిని కలిశారో.. వారి సమాచారాన్ని అధికారులకు ఇచ్చారు. అందులో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. తనను కలిసిన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆమె తన ఫేస్ బుక్ పోస్ట్ లో చెప్పుకొచ్చారు. అలా చేస్తే అధికారులను కూడా ట్రేస్ చేసే పని తగ్గుతుందని కోరారు. శనివారం నాడు తనకు స్వల్పంగా తలనొప్పి, గొంతులో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించాయని, దాంతో కరోనా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఓ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున ఇటీవల తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించానని, ఆ సమయంలోనే కరోనా సోకి ఉంటుందని సుమలత తెలిపారు.

తాను కరోనా వైరస్ నుండి వీలైనంత త్వరగా కోలుకుంటానని భావిస్తూ ఉన్నానని.. తనకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడమే కాకుండా ప్రజల దీవెనలు కూడా ఉన్నాయని తెలిపారు. తాను ఇప్పటివరకు కలిసిన వారందరి వివరాలు అధికారులకు వెల్లడించానని.. ఇంకా ఎవరినైనా తాను కలిసినట్టయితే, వారిలో ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

కన్నడ లెజెండరీ నటుడు కీర్తిశేషుడు అంబరీష్ భార్య సుమలత. మాండ్యా ముద్దు బిడ్డ అయిన అంబరీష్ చనిపోవడంతో ఆ లోక్ సభ స్థానం ఖాళీ అయింది. అభిమానుల కోరికను మన్నించి సుమలత పోటీలో నిలబడ్డారు. హెచ్డీ కుమారస్వామి కుమారుడు, హీరో నిఖిల్ గౌడ కూడా పోటీలో నిలబడ్డాడు. ప్రజలు మాత్రం తెలుగమ్మాయి సుమలతనే గెలిపించారు.

Next Story