అలాంటి వదంతులు నమ్మకండి: ఎస్పీ చరణ్‌

By సుభాష్  Published on  11 Sep 2020 2:38 AM GMT
అలాంటి వదంతులు నమ్మకండి: ఎస్పీ చరణ్‌

కరోనా బారిన పడి కొన్ని రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ప్రస్తుతం మెరుగు పడుతోంది. కరోనాతో పోరాడుతున్న ఆయనకు ఇటీవల నెగిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై చరణ్‌ ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్టు చేస్తున్నారు.

అందులో నాన్న గారు చాలా నిదానంగా కోలుకుంటున్నారు. ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు లేవు. అయినా ఇంకా ఎక్మో, వెంటిలేటర్‌ చికిత్స కొనసాగుతోంది. ఆయన తప్పకుండా కోలుకుంటారు. అయితే దానికి ఎంత సమయం పడుతుందనే విషయం చెప్పలేను అంటూ చరణ్‌ సోషల్‌ మీడియాలో తెలిపారు.

అలాగే గత కొన్ని రోజులుగా బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి మీడియాలో, సోషల్‌ మీడియలో వస్తున్న తప్పుడు వార్తలపై చరణ్‌ ఖండించారు. బాలసుబ్రహ్మణ్యం పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతున్నారు. ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో లంగ్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌చే వస్తున్నారు. అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నేను గానీ, ఆస్పత్రి వైద్యులు గానీ ఇచ్చే అప్‌డెట్స్‌ను మాత్రమే నమ్మండి.. లేనిపోని పుకార్లను నమ్మకండి అంటూ చరణ్‌ విజ్ఞప్తి చేశారు.

కాగా, కారోనా పాజిటివ్‌ రావడంతో ఆగస్టు 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత ఎక్మో సాయం అందిస్తూ చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా స్పృహలోనే ఉన్నారని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడినట్లు తెలిపారు. ఆయనకు మళ్లీ కరోనా పరీక్షలు చేయగా, నెగిటివ్‌ వచ్చింది. ఇన్ని రోజులు బాలు అనారోగ్యం కారణంగా బాగా నిరసించి పోయారని, అందుకే ఇంకా చికిత్స కొనసాగుతుందని వైద్యులు వివరించారు.

Next Story