రూ. 31,500 స్మార్ట్ టీవీ.. కేవలం రూ. 2,450కే
By సుభాష్ Published on 27 Jan 2020 8:20 AM GMT
ఏదైన వస్తువులపై డిస్కౌంట్ ఇస్తున్నారంటే చాలు జనాలు ఎగబడి ఎగబడి కొంటుంటారు. ఎన్ని పనులు ఉన్నా సరే షాపుల వద్ద క్యూ కట్టాల్సిందే. ఏదైన షాపునకు వెళ్లినప్పుడు అతి తక్కువ ధరకు వస్తుందని చూస్తాం తప్ప, అది ఎందుకు అంత తక్కువ ధరకు ఇస్తున్నారనే విషయం ఆలోచించం. కానీ ఇక్కడ మాత్రం ఓ షాపు చేసిన పొరపాటుకు పెద్ద రచ్చ రచ్చ జరిగింది. ఇది జరిగింది మనదేశంలో అనుకుంటే పొరపాటే. ఫ్రాన్స్లో.
ఫ్రెంచ్ రిటైల్ స్టోర్ ఇటీవల టీవీలపై బంఫరాఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ షాపు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఇవ్వడంతో జనాలు పెద్ద ఎత్తున 'క్యూ'కట్టారు. బారులు తీరిన కస్టమర్లను షాపు యాజమాన్యం కంట్రోల్ చేయలేకపోయింది. పెద్ద గొడవ జరిగిపోయింది. జెయింట్ క్యాసినో అనే రిటైల్ స్టార్ పొరపాటున టీవీ ధరను 30.99 యూరోలుగా ప్రకటించింది. దీని అసలు ధర 399 యూరోలు. ఇక మన కరెన్సీలో అయితే పొరపాటు ప్రకటించిన ధర రూ.2,450, ఇక అసలు ధర రూ.31,500.
ఈ స్టోర్ ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్ సోషల్ మీడియాలో తెర వైరల్ అయింది. దీంతో జెయింట్ క్యాసినో అనే రిటైల్ స్టార్ ఇచ్చిన ఆఫర్ తో ఓ షాపు వద్ద జనాలు బారులు తీరి ఒక్కొక్కరు ఒకటి కాకుండా నాలుగైదు టీవీలను షాపింగ్ ట్రాలీలో వేసుకున్నారు. వీరి హడావిడిని చూసి షాపు వారు ఏంటని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.
అయితే పొరపాటున రిటైల్ స్టార్ టీవీలపై ఇచ్చిన డిస్కౌంట్ ధరకు ఇవ్వడానికి సదరు షాపు యాజమాన్యం అంగీకరించలేదు. ఏదో అనుకోకుండా పొరపాటు జరిగిందని చెప్పుకొచ్చింది. దీంతో కస్టమర్లు షాపు యజమానులపై విరుచుకుపడ్డారు. డిస్కౌంట్లో టీవీలు ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. షాపు యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నానా హంగామా సృష్టించారు. దీంతో యాజమాన్యం చేసేదేమి లేక పోలీసులకు సమాచారం అందించారు. రంగప్రవేశం చేసిన పోలీసులు కస్టమర్లను వెనక్కి పంపించారు. రిటైల్ స్టోర్ చేసిన చిన్న తప్పుతో ఇంత పెద్ద రచ్చ జరిగింది.