సచిన్‌కు ఫెర్రీ సవాల్‌.. తొలి బంతి ఫోర్‌..

By Newsmeter.Network  Published on  9 Feb 2020 11:21 AM GMT
సచిన్‌కు ఫెర్రీ సవాల్‌.. తొలి బంతి ఫోర్‌..

భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండ్కూలర్‌ దాదాపు ఆరేళ్ల తరువాత బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్‌ గా మలచి తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఓ చారిటబుల్‌ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కారణంగా నష్టపోయిన వారిని అదుకునేందుకుగాను బుష్‌ ఫైర్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ను నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో భాగంగా పాంటింగ్‌ ఎలెవన్‌, గిల్‌క్రిస్ట్‌ ఎలెవన్‌ రెండు జట్లుగా విడిపోయి ఆడాయి.

పాంటింగ్‌ జట్టుకు సచిన్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అయితే ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ ఎలీస్‌ పెర్రీ సచిన్‌కు సరదాగా ఛాలెంజ్‌ విసిరింది. ఈ మ్యాచ్‌ విరామ సమయంలో తన బౌలింగ్‌ను ఎదుర్కొవాలని సవాల్ విసిరింది. దీనికి సచిన్‌ ఓకే చెప్పాడు. భుజం గాయం కారణంగా సచిన్‌ ఆటకు దూరంగా ఉండాలని డాక్టర్ల సూచనను పక్కకు పెట్టి మరీ బ్యాటింగ్‌ చేశాడు.

ఎదుర్కొన్న తొలి బంతినే ఫైన్‌లెగ్ మీదుగా బౌండరీకి తరలించాడు. తర్వాత బంతులను డీప్‌ స్వేర్ లెగ్, షార్ట్ పైన్‌ లెగ్, మిడ్ ఆన్‌, కవర్స్‌ మీదుగా చూడముచ్చటైన షాట్లతో అలరించారు. కాగా చాలా కాలం తర్వాత జెర్సీ నంబర్‌ 10 మైదానంలో కనిపించడంతో సచిన్‌ సచిన్‌ అంటూ నినాదాలు చేశారు. 2013 నవంబర్‌లో భారత్ తరుపున సచిన్‌ తన చివరి టెస్టును ఆడాడు. ఈ మ్యాచ్‌ లో పాంటింగ్‌ సేన, గిల్‌క్రిస్ట్ జట్టు పై పరుగు తేడాతో విజయం సాధించింది.



Next Story